రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో వ్యక్తిపూజకు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో దేశవ్యా ప్తంగా ఇందిరమ్మ పేరు మార్మోగింది. ఇదే.. ఆమె దూకుడుకు కారణమైంది. ఫలితంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకువచ్చాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, కర్ణాటక జేడీఎస్ వంటివి రావడానికి కారణం.. నాడు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన వ్యక్తిపూజే కారణమన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు పడుతున్న ప్రయాస… ప్రాంతీయ పార్టీలను బుజ్జగించలేక పోతున్న వైనం కళ్లకు కడుతూనే ఉంది. అయినప్పటికీ.. ఇటీవల కాలంలో కాంగ్రెస్పార్టీ మరోసారి వ్యక్తిపూజ దిశగానే ముందుకు సాగుతోంది. పేరుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నప్పటికీ.. నిర్ణయాలన్నీ.. రాహుల్ గాంధీ కేంద్రంగానే సాగుతున్నాయన్న ప్రచారం జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇదే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని `ఇండియా` కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందిని తీసుకువస్తోందన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త.. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను ఆచరిస్తున్నామని చెబుతున్నా.. ఆ తరహా సిద్ధాంతాలకు గత 10 సంవత్సరాల్లో పార్టీ ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నది ఆర్ ఎస్ ఎస్ వాదిగా ఉన్న మురళీమనోహర్ జోషి వంటివారు పదే పదే వాపోతున్నారు. ఆడంబరాలకు పోకుండా.. ప్రజల కేంద్రంగా ఉన్నప్పుడు పార్టీ విస్తృత ప్రజాప్రయోజనం నెరవేరుతుందన్న సిద్ధాంతం కనిపించడం లేదన్న వాదన ఆర్ ఎస్ ఎస్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
పైగా.. ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి.. బీజేపీ మొత్తం విభాగాలను తన గుప్పిట పట్టినట్టు స్పష్టం అవుతోందన్నది కూడా జాతీయ విశ్లేషకులు చెబుతున్న మాట. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నుంచి క్షేత్రస్థాయి నాయకుల ఎంపిక వరకు కూడా.. అన్నీ సిద్ధాంతాలకు భిన్నంగా `వ్యక్తిగత` ఎంపికలేనన్న వాదన ఇటీవల బలపడిందని చెబుతున్నారు. `అహం బ్రహ్మాస్మి` అన్న చందంగా వ్యక్తిపూజకుబీజేపీలో ఏనాడో బీజం పడిందని.. ప్రస్తుతం మానైందన్న భావన వ్యక్తం అవుతోంది.
మంచిదేనా?
జాతీయ పార్టీల వైఖరిని ప్రాంతీయ పార్టీలు నిశితంగా గమనిస్తాయి. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ దాదాపు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇది ఆ పార్టికి వెన్నువిరిచిన చందంగా మారిపోయింది. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. `మోడీ ఇమేజ్` మంత్రాన్నే కమల నాథులు పఠిస్తున్నారు. ఇది ఎన్నాళ్లు ఉంటుందన్నది గత 2024 ఎన్నికల్లోనే స్పష్టమైంది. దీంతో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జేడీయూల మద్దతుతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న పరిస్థితి ఏర్పడింది. సో.. సిద్ధాంతాలను పక్కన పెట్టి.. వ్యక్తిపూజల కోసం పరుగులు పెడుతున్న రెండు పార్టీల వైఖరి దేశ రాజకీయాలకు ప్రమాదకర సంకేతాలను ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates