ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో నాయకులపై ఎక్కేస్తే.. వారు మాత్రం ఊరుకుంటారా? ఎంత విధేయులైనా వారికి కూడా మనో భావాలు ఉంటాయి. వారికి కూడా సొంత సత్తా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే వెలుగు చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావడం అనేది కామన్. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. అందుకే.. ఏకగ్రీవాలు అయిన పంచాయతీలు, మునిసిపాలిటీలకు అత్యధిక నిధులు కూడా కేటాయించే సంస్కృతి ఉంది.
కానీ, దీనిని జగన్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఏకగ్రీవాలు అయితే.. ఎమ్మెల్యే టికెట్ కట్ అంటూ.. ఆయన సరికొత్త షరతు పెట్టారు. అయితే.. ఈ విషయంపై సీనియర్లు ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. ఈ ఫార్ములా ఆయనకు కూడా వర్తిస్తుందా? కేవలం మనకేనా? అంటూ.. నాయకులు గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పాగా వేయాలని టీడీపీ ఎన్నాళ్లుగానో వేసింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికను కూడా టీడీపీ గెలుచుకుంది. ఇక, స్థానికంగా ఉన్న వైసీపీనాయకులు కూడా చాలా వరకు టీడీపీ సైకిల్ ఎక్కారు.
సో.. ఇప్పుడు పులివెందులలో వైసీపీకి భారీ స్థాయిలో మద్దతు దారులు లేరనే చెప్పాలి. ఇలాంటి సమయంలో వస్తున్న స్థానిక ఎన్నికల్లో పులివెందులలోనిపలు మండలాల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు టీడీపీ నాయకులు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ప్రజలను, నాయకులను కూడా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలోని పులివెందుల, లింగాల, వేముల, తొండూరు, చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లెల్లో హీన పక్షం నాలుగు మండలాలను(ఎంపీపీ) ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేసింది.
మరి ఇదే జరిగితే.. జగన్ కూడావచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ తీసుకోకుండా ఉంటారా? అనేది వైసీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్న. నిజానికి తాను ఆచరించి.. నాయకులతో ఆచరించేలా చేయడం నాయకుడి లక్షణం. పైగా.. అలివికాని చోట అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఈ విషయం జగన్కు కూడా తెలిసిందే. అయినప్పటికీ.. కేవలం నాయకులను మాత్రమే బాధ్యులను చేసేలా ఆయన తీసుకున్న నిర్ణయంపై జిల్లాల్లో సీనియర్లు మండి పడుతున్నారు. మరి తన వ్యవహారంపై కూడా జగన్ క్లారిటీ ఇస్తారా? లేదా? అనేది వేచిచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates