నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్ సూపర్ హిట్ కావడం, అందులో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామి కావడం మాములు కిక్ ఇవ్వలేదు. ఇది అయిపోగానే విశ్వనాథ్ అండ్ సన్స్ వచ్చింది. ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి సూర్యకు మరో డబుల్ సెంచరీ మూవీ అయ్యింది. తమిళం కంటే తెలుగులో బాగా ఆడిన ఈ ఫ్యామిలీ డ్రామా నాగవంశీకి డబుల్ జోష్ ఇచ్చింది.
ఇదే ఊపులో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ కూడా ఆడేస్తే హ్యాట్రిక్ అవుతుందని ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు. ఆశించిన స్థాయిలో ఎపిక్ మేజిక్ చేయలేకపోతోంది. జెన్ జీ యువతను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రేమకథను చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆ వర్గం నుంచే తిరస్కారానికి గురయ్యింది. వీకెండ్ వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. పాతిక రోజులో ఉన్న ఇరుముడి నిన్న 49 వేల టికెట్లు అమ్మితే మూడో రోజులో ఉన్న ఎపిక్ కేవలం పది వేల టికెట్లకే పరిమితమయ్యింది.
మొదటి రోజు సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టిన నాగవంశీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. బాక్సాఫీస్ తత్వం అర్థమైపోవడంతో లేనిపోని హంగామా చేయడం లేదు. లేదంటే ఈపాటికి మరో విజయోత్సవ వేడుక ఉండేది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మాత్రం నాన్ స్టాప్ గా థియేటర్ విజిట్స్ తో ప్రమోషన్లు చేస్తున్నారు కానీ వాటి ప్రభావం అంతగా లేదనేది వాస్తవం. విడుదలకు ముందు మీడియాలో బాగా హైలైటైన శివాజీ పోస్ట్ రిలీజ్ ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు. బహుశా బిజీనేమో.
నాగవంశీ నెక్స్ట్ జైలర్ 2 హక్కుల మీద కన్నేశారని ట్రేడ్ టాక్. ఇంకా ఖరారు కాలేదు కానీ నిర్మాత అడిగిన రేటు మరీ ఎక్కువ ఉండటంతో పెండింగ్ లో ఉందట. చాలా కాలంగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ ఆల్కహాల్, గౌతమ్ తిన్ననూరి మేజిక్ ఎప్పుడు విడుదలవుతాయనేది తెలియడం లేదు. డైరెక్ట్ ఓటిటి అంటున్నారు కానీ ఇంకా ఆ సంకేతాలు మొదలు కాలేదు. వీటి సంగతేమో కానీ తారక్ త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా మూవీ మీద నాగవంశీ పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates