మంత్రి vs ఎమ్మెల్యే… సీఎంకు తలనొప్పే!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ‌, ఇదే జిల్లాకు చెందిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రికి మ‌ధ్య పాత రాజ‌కీయ క‌క్ష‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. క‌డియం బీఆర్ ఎస్‌లోకి వెళ్లారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నా.. ఆయ‌న కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా ఉన్నా.. జిల్లా మొత్తంపై క‌డియం పైచేయి సాధిస్తున్నార‌న్న వాద‌న ఉంది.

ఈ నేప‌థ్యంలోనే త‌ర‌చుగా క‌డియం వ‌ర్సెస్ కొండాల మ‌ధ్య వివాదం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా క‌డియం శ్రీహ‌రి.. దేవ‌దాయ శాఖ ప‌నితీరుపై స‌మీక్షించార‌ని.. అధికారుల‌తో ఆయ‌న రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. సురేఖ ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల మంత్రి సురేఖ విదేశాల్లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలోనే క‌డియం త‌న శాఖ‌(దేవ‌దాయ‌)కు చెందిన అధికారుల‌తో స‌మీక్షించార‌న్న‌ది సురేఖ ఆరోప‌ణ‌. ఇది రూల్ ఆఫ్ బిజినెస్‌ను అతిక్ర‌మించ‌డ‌మేన‌ని ఆమె పేర్కొంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సురేఖ లేఖ రాశారు. కడియం శ్రీహ‌రి త‌న శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతోపాటు.. ఒక మంత్రికి చెందిన శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌డం కూడా స‌రికాద‌ని.. ఇది చ‌ట్ట నిబంధ‌న‌ల‌తో పాటు మంత్రుల‌కు ఉండే ఎక్స్ అఫిషియో నిబంధ‌న‌ల‌ను కూడా ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఘాటుగా పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తార‌న్న‌ది చూడాలి.

కాగా.. మ‌రోవైపు క‌డియం కూడా ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. తాను ఎవ‌రితోనూ స‌మీక్ష‌లు నిర్వ‌హించలేద‌న్నారు. అయితే.. తాను మాత్రం.. దేవ‌దాయ శాఖ అధికారుల‌తో భేటీ అయిన మాట వాస్త‌వ‌మేన‌ని.. కానీ, అవి పూర్తిగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన స‌మ‌స్య‌లేన‌ని ఆయ‌న తెలిపారు. ఇది త‌ప్పెలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు తాను రెడీగానే ఉన్నాన‌ని.. సీఎం పిలిస్తే.. వెళ్లి అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఆయ‌న‌కు వివ‌రిస్తాన‌ని క‌డియం పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సీఎంకు ఈ ఇద్ద‌రి వ్య‌వహారం త‌ల‌నొప్పిగా మార‌డం గ‌మ‌నార్హం.