చంద్ర‌బాబుగారూ… ఈ స‌మ‌స్య‌పై స్పందించ‌రా?: జ‌గ‌న్ ట్వీట్‌

సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి వైసీపీ అధినేత జ‌గ‌న్ సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఆస‌క్తిక‌ర పోస్టు చేశా రు. చంద్ర‌బాబుగారూ.. అని ఉద్దేశిస్తూ.. ఈ స‌మ‌స్య మీకు ప‌ట్టదా? అని ప్ర‌శ్నించారు. ల‌క్ష‌ల మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేస్తున్నారా? అని నిల‌దీశారు. వారి స‌మ‌స్య‌ను ప‌ట్టించుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఈ మేర‌కు సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు.

విష‌యం ఏంటి?

ప్ర‌స్తుతం క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్‌ను జిల్లాకు చెందిన ప‌లువురు ఉపాధ్యాయ సంఘాల నేత‌లు క‌లి శారు. ఈ సంద‌ర్భంగా గ‌త ఏడాది సుప్రీంకోర్టు.. ఉపాధ్యాయుల విష‌యంలో ఇచ్చిన సంచ‌ల‌న తీర్పును ప్ర‌స్తావించారు. గ‌తంలో ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష(టెట్‌) రాయ‌కుండానే.. ఉపాధ్యాయ పోస్టులు ద‌క్కించు కున్న‌వారికి.. ఇప్పుడుటెట్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని.. దీనికి రాష్ట్రాల‌తో సంబంధం లేద‌ని సుప్రీంకోర్టు గ‌తంలోనే తీర్పు ఇచ్చింది. ఇది 1995ల నుంచి అమ‌లు చేయాల‌ని కూడా పేర్కొంది.

ఈ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో అనేక ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. రివ్యూ పిటిష‌న్ వేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. అయితే.. ఇప్ప‌టికే టెట్ రాసిన వారిని దీని నుంచి మిన‌హాయించారు. ఈ వ్య‌వ‌హారంపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులు బెంగ పెట్టుకున్నారు. వ‌చ్చే ఏడాది రిటైర్ కానున్న వేలాది మంది ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు టెట్ రాయాల్సి వ‌చ్చింది. ఇది రాయ‌క‌పోతే.. బెనిఫిట్స్ నిలుపుద‌ల చేస్తారు.

ఈ నేప‌థ్యంలోనే టెట్‌నుంచి త‌మ‌ను మిన‌హాయించాల‌ని కోరుతూ.. ప‌లువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ.. ఈ విష‌యంలో తాము ఏమీ చేయ‌లేమ‌ని కేంద్రం కూడా ఇటీవ‌ల స్ప‌ష్టం చేసింది. దీనిపైనే తాజాగా ఉపాధ్యాయులు జ‌గ‌న్‌ను క‌లిసి విన్న‌వించ‌డంతో ఆయ‌న తాజాగా సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి లేఖ రాశారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాల‌ని జ‌గ‌న్ సూచించారు. అయితే.. వాస్త‌వానికి.. కేంద్రం కూడా ఈ విష‌యంలో త‌ప్పుకొన్నాక‌.. ఇప్పుడు రాష్ట్రం ఏం చేస్తుంద‌న్న ప్ర‌శ్న ఉండ‌గా.. దీనిని విస్మ‌రించిన జ‌గ‌న్‌.. త‌న లేఖ ద్వారా స‌ర్కారును ఇరుకున పెట్టి.. ఉపాధ్యాయుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.