ఎల్నినో… ఏపీలో ఈ జిల్లాలపై ప్రభావం ఎక్కువేనట!

ఖరీఫ్ సీజన్ మొదలై నెల కావొస్తుంది. కానీ ఆకాశం నుంచి చుక్క నీటి జాడలేదు. మేఘాలు మొఖం చాటేశాయి. ఇదంతా ఎల్నినో ప్రభావమేనని శాస్ట్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాలు చల్లి ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన ఈ సమయంలో అన్నదాతలు నాలుగు చినుకుల కోసం తలెత్తి చూస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్థం అవుతోంది.

ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఏఏ జిల్లాలలో ఎక్కవగా ఉండబోతోంది అనే అంశంపై అధికారులతో కలసి ఓ అంచనాకు వస్తోంది. జూన్ నెలలో రాష్ట్రంలో -25 శాతం వర్షపాతం లోటు నమోదవగా, జూలై నెలలో ఇప్పటివరకు -41 శాతం లోటు నమోదైందని తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ నుంచి నవంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం -27 శాతం వర్షపాతం లోటుతో ముగిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మొత్తం ఏపీలో 688 మండలాలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావం 105 మండలాలు తీవ్రంగా ఉంబోతోంది. 208 మండలాలు మధ్యస్థ స్థాయిలో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైఎస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మధ్యస్థ స్థాయి ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్-నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.