ఒవైసీ విద్యాసంస్థ‌ల‌ను మూసేస్తారా?

హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ‌ల‌కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపైనా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న‌ సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఫాతిమా విద్యాసంస్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ప‌రిధిలో జ‌రిగిన నిర్మాణాల‌కు ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని, ఇప్ప‌టికే చాలా నిర్మాణాల‌ను కూల్చి వేశార‌ని .. అలాంట‌ప్పుడు వీటిని ఎందుకు కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తూ.. విజ‌య్‌గోపాల్ అనే న్యాయ‌వాది హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ పిటిష‌న్‌పై తాజాగా విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు.. ఒవైసీ విద్యాసంస్థ‌ల విష‌యంపై ప్ర‌భుత్వ వాద‌న‌ను కోరింది. దీంతో ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది స్పందిస్తూ.. ఒవైసీ విద్యాసంస్థ‌ల‌కు ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని, అదేస‌మ‌యంలో భ‌వ‌న నిర్మాణాల‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కూడా ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వాటిని చూస్తూ ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

విద్యాసంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. భ‌వ‌న నిర్మాణాల‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. అలాంట‌ప్పుడు వాటిని మూసేయ‌డ‌మే క‌రెక్ట్‌ అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. అయితే.. తాము అనుమ‌తుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని.. కానీ, ఇటు ప్ర‌భుత్వం, అటు జీహెచ్ ఎంసీ కూడా స్పందించ‌డం లేద‌ని విద్యాసంస్థ‌ల త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు ఇదేంటి? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ.. త‌దుప‌రి విచార‌ణ స‌మ‌యానికి ప్ర‌భుత్వం, జీహెచ్ ఎంసీలు తీసుకునే నిర్ణ‌యంపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.