తన సొంత జిల్లా కడపపై వైసీపీ అధినేత జగన్ పట్టుకోల్పోయారా? ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? ఏనేత ఏం చేస్తున్నారు? అనే విషయాలపైనా ఆయన దృష్టి పెట్టలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు నాయకులు. ఇటీవల మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే తిష్ఠవేసి.. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ పనులను ఎంపీ అవినాష్ తన పార్లమెంటు నిధులతో చేపట్టారు. అయితే.. ఆయా కార్యక్రమాలకు పలువురు నాయకులు డుమ్మా కొట్టారు.
కారణాలుఏవైనా.. కూడా వైసీపీ అధినేత జిల్లాకు వస్తే.. కనీసం పార్టీపై ఉన్న గౌరవంతో అయినా రావాల్సిన నాయకులు రాకుండా పోవడం ఒకరిద్దరు నాయకులు మొహం చూపించి వెళ్లిపోవడం వంటివి పార్టీలో ఉన్న అనైక్యతకు జగన్ అనుసరిస్తున్న వైఖరి పట్ల వారికి ఉన్న అభిప్రాయానికి నిదర్శనంగా నిలుస్తోంద ని అంటున్నారు. నిజానికి ప్రస్తుతం పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఆ జిల్లా.. ఈ జిల్లా అనే తేడానే లేదు.
మరీ ముఖ్యంగా పార్టీకి కంచుకోటలుగా ఉన్న నెల్లూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం వంటి చోట్లే ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నాయకులను ఇష్టానుసారంగా మార్చడం. ఎవరికీ ఇష్టం లేకపోయినా.. కొత్త వారికి అవకాశం కల్పించడం వంటివి సీనియర్లలో ఆగ్రహాన్ని పెంచాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదన్న వాదన ఇప్పటికీ ఉంది. ఈ కారణాలే ఇప్పటికీ సొంత జిల్లాలోనూ కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాపై వైసీపీ పట్టు కోల్పోతోందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటివారిని కూడా జగన్ మంత్రివర్గంలోకి తీసుకోలేక పోయారు. అలానే.. రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసినా.. తాజాగా దానిని మదనపల్లికి మార్చేసినా.. వైసీపీ నాయకులు మారు మాట్లాడలేక పోయారు. ఇక, కీలకమైన జమ్మలమడుగులో బీజేపీ విస్తరించింది. కడపలో టీడీపీ విజయం దక్కించుకుంది. ఇప్పుడు పులివెందుల పైనా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా.. పార్టీ పరంగా బలమైన చర్యలు లేకపోవడాన్ని నాయకులు తప్పుబడుతున్నారు. దీంతో ఎవరికి వారు.. మౌనంగా ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
