ఏపీలో రాజకీయాలు ఎలాగైతే అంతకంతకూ వేడెక్కిపోతున్నాయో.. నేరాలు కూడా అదే రీతిన హడలెత్తిస్తున్నాయి. ఆయా నేరాలకు పాల్పడిన వారు… వాటి నుంచి తప్పించుకునేందుకు కులం,మతం, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా కుటిల యత్నాలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగాయని చెప్పాలి. ఇలాంటి కీలక తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన విన్నంతనే… ఇక నేరాలు చేయాలంటేనే ఆయా వ్యక్తులు భయకంపితులు కావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం హోదాలో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన పవన్ కల్యాణ్… సైబర్ నేరాలు, ఇతర తీవ్రమైన నేరాలకు సంబందించి కీలక ప్రకటనలు చేశారు. ఇకపై నేరాలు చేసే వ్యక్తులకు, ఆయా నేరాలకు కులం గానీ, మతం గానీ, రాజకీయ పార్టీలు గానీ ఉండబోవని పవన్ ప్రకటించారు. నేరాలకు, నేరస్తులకు కులం, మతం, రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించడం ఇకపై కుదరదని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నేరాలకు పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన పవన్… ఈ విషయంలో కులం, మతం, రాజకీయ పార్టీలన్న అంశాలను పరిగణనలోకి తీసుకునేది లేదని ప్రకటించారు.
ఇక సైబర్ నేరాల గురించి కూడా ప్రస్తావించిన పవన్… ఈ నేరాలకు సంబందించిన చర్యలపై పర్యవేక్షణ జరిపేందుకు ఏకంగా తన కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సైబర్ దాడులకు గురయ్యే బాధితులు ఇకపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విభాగానికి ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులకు ఆధారాలుగా స్క్రీన్ షాట్లు, లింకులు, వీడియోలు, ఇతరత్రా డిజిటల్ సాక్ష్యాలను జత చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి… సంబంధిత శాఖలకు వాటిని పంపి… వాటిపై చర్యలు తీసుకునే దిశగా ఈ విబాగం పనిచేస్తుందని పవన్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ప్రకటనపై ఏపీలో ఓ రేంజి చర్చ అయితే మొదలైంది. నేరాలకు పాల్పడే వారు తమను తాము రక్షించుకునేందుకు కులం, మతం… అవీ కాకపోతే పొలిటికల్ కార్డులను వినియోగించడం ఇటీవల పెరిగిపోయిందని, వాటికి చెక్ పెట్టేలా పవన్ నిర్ణయం ఉందన్న దిశగా ఆసక్తికర చర్చలకు తెర లేసింది. అదే సమయంలో సైబర్ నేరాలకు సంబందించి ఎంతగా దర్యాప్తులు జరుగుతున్నా… ప్రత్యేకమైన విభాగాలు అంటూ లేని కారణంగా సైబర్ నేరగాళ్లు ఈజీగా తప్పించుకోవడమో.. లేదంటే చిక్కినా… చిన్నపాటి శిక్షలతోనే తప్పించుకుంటున్నారని… పవన్ మార్క్ స్టేట్ మెంట్ తో ఇకపై సైబర్ నేరగాళ్లకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమన్న విశ్లేషణలు సాగుతున్నాియ.
Gulte Telugu Telugu Political and Movie News Updates