కొడాలి నానీపై చ‌ర్య‌లు వ‌ద్దు

kodali

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఏపీ హైకోర్టు తాజాగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. త‌మ త‌దుప‌రి ఆదేశాలు వెలువ‌డే వ‌ర‌కు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం కానీ.. ఇత‌ర చ‌ర్య‌లు తీసుకోవ‌డం కానీ, చేయొద్ద‌ని పోలీసుల‌ను ఆదేశించింది. తాజా కేసులో పొలిటిక‌ల్ అప్పియ‌రెన్స్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్న న్యాయ‌వాది వాద‌న‌ల‌తో ఏకీ భ‌వించిన కోర్టు పోలీసుల చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టింది. ఇలాంటి కేసుల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌.. సాధార‌ణ పౌరుల భ‌ద్ర‌తపై చూపించాల‌ని సూచించింది. త‌మ ఆదేశాలు లేకుండా కొడాలి నానిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరాద‌ని న్యాయ‌మూర్తి తేల్చి చెప్పారు.

ఏంటి వివాదం..?

2021లో అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చింది. అయితే.. అనూహ్యంగా క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి చెంద‌డంతో ఈ ఎన్నిక‌ల‌ను అప్ప‌టి ఎన్నిక‌ల ఏపీ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ వాయిదా వేశారు. అయితే.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా వాయిదా వేయ‌డ‌మేన‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ సైతం నేరుగా మీడియా ముందుకు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌కు కులం అంట‌గ‌ట్టి వ్యాఖ్య‌లు చేశారు. ఇది పెను దుమారంగా మారింది. ఇక‌, అప్ప‌టి ప్ర‌తిప‌క్షం టీడీపీకి మేలు చేసేందుకే నిమ్మ‌గ‌డ్డ ఇలా వ్య‌వ‌హ‌రించారని కూడా అన్నారు.

ఈ క్ర‌మంలో కొడాలి నాని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌, మాజీ సీఎం చంద్ర‌బాబుల‌ను ఉద్దేశించి ఆయ‌న దూషించారు. అదేస‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. గుడివాడ పోలీసులు కేసు న‌మోదు చేశారు. కానీ, అప్ప‌టికే కొడాలి నానీ మంత్రి కావ‌డంతో అధికారులు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఇక‌, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ఈ కేసుపై నాన్చుడు ధోర‌ణిని అవ‌లంభించారు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు చెంత‌కు ఈ కేసు వ్య‌వ‌హారం చేర‌డంతో ఆయ‌న విచార‌ణ‌కు ఆదేశించారు.

ఫ‌లితంగా వారం కింద‌ట పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చేందుకు కొడాలి నాని ఇంటికి వెళ్ల‌గా ఎవ‌రూ లేర‌ని స‌మాధానం వ‌చ్చింది. అయితే.. ఇంత‌లోనే కొడాలి త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టును ఆశ్ర‌యించి పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. ఇది రాజ‌కీయ దురుద్దేశ పూరిత కేసు అని.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు కొడాలి వ్యాఖ్య‌ల‌కు సంబంధం లేద‌ని.. రాజ‌కీయంగా నానీని ల‌క్ష్యంగా చేసుకుని పెట్టిన కేసు అని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండ‌డంతోపాటు కేసును కొట్టివేసేలా ఆదేశించాల‌న్నారు. దీంతో హైకోర్టు కొడాలినానిపై ఎలాంటి చర్య‌లూ తీసుకోవ‌ద్ద‌ని ఆదేశిస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చింది.