ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్ రిటైర్మెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 1993వ సంవ‌త్స‌రం అఖిల భార‌త స‌ర్వీసుల‌కు చెందిన సునీల్ కుమార్‌.. ఏపీలో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. వైసీపీ హ‌యాంలో సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసిన‌ప్పుడు వివాదాల‌కు కేంద్రంగా నిలిచారు.

తాజాగా ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ గ‌డువు(జూన్ 30) రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. సస్పెండెడ్ డీజి సునీల్ కుమార్ ఐపీఎస్‌ను… ఆయ‌న‌పై కొనసాగుతున్న శాఖాపరమైన / ప్రభుత్వ విచారణలకు ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీస్ నుంచి రిలీవ్ చేసేవిధంగా డీజీపీ తదుపరి చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల‌న్నారు.

ర‌ఘురామ కేసుతో..

ర‌ఘురామ కేసుతో.. రాష్ట్ర వ్యాప్తంగా సునీల్ కుమార్ వివాదాస్ప‌ద‌మ‌య్యారు. వాస్త‌వానికి ఐపీఎస్‌గా అనేక సంవ‌త్స‌రాలు సేవ‌లు అందించిన ఆయ‌న‌.. ఎక్క‌డా వివాదానికి గురికాకుండా కెరీర్‌లో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కానీ, వైసీపీ హ‌యాంలో ర‌ఘురామ‌ను ఆయ‌న పుట్టిన రోజు నాడే అరెస్టు చేయ‌డం.. గుంటూరులోని సీఐడీ ఆఫీసులో పెట్టి టార్చ‌ర్ పెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ వ్య‌వ‌హారంపై ర‌ఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ప‌రిధిలో ఉంది.

స్వేచ్ఛ వ‌చ్చింది!

త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రావాల‌ని భావిస్తున్న సునీల్ కుమార్‌కు ఇక స్వేచ్ఛ ల‌భించింద‌ని ప‌లువురు అధికారులు పేర్కొన్నారు. ఎస్సీ మాల సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌.. రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. త‌ర‌చుగా ఫేస్‌బుక్‌, యూట్యూబుల్లో యాక్టివ్‌గా ఉండే సునీల్ కుమార్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తామ‌ని చెబుతున్నారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉండి నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం ఉండ‌డం గ‌మ‌నార్హం.