అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా నిధులు మంజూరవుతూ, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో “మేము కానీ, జగన్ గారు కానీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పాం” అంటూ కొత్త వాదనను ముందుకు తీసుకొస్తోంది.
అయితే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన, అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం మౌనం, ఆ తర్వాత ‘మావిగన్’ అనే కొత్త విధానం… ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదనే వాదనతో వైసీపీ పూటకో మాట మార్చుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో కొందరు వైసీపీ నేతలు రాజధానిలో పర్యటించగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మరోసారి అమరావతి అంశాన్ని రాజకీయ చర్చకు తెచ్చింది.
అసలు అమరావతిపై వైసీపీ అధికారిక వైఖరి ఏమిటన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదు. ఒకప్పుడు అమరావతిని శ్మశానంగా అభివర్ణించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విలేకరుల సమావేశంలో మావిగన్ మా విధానం అని చెప్పారు. మూడు రాజధానులు ఐదేళ్ల కిందటి విధానం అని పేర్కొంటూనే, ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడమే మా లక్ష్యం అని వ్యాఖ్యానించారు.
మరోవైపు వైసీపీ నేత దేవినేని అవినాష్ కూడా “మేము అమరావతి పేరుతో మీరు చేసే అవినీతికి, దోపిడీకి వ్యతిరేకం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మాత్రమే కోరుతున్నాం” అని అన్నారు. మేము కానీ, జగన్ గారు కానీ ఏ రోజైనా అమరావతికి వ్యతిరేకమని చెప్పామా? అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మాత్రమే చెబుతున్నాం అని ఆయన ఈరోజు అన్నారు.
దీంతో అమరావతిపై వైసీపీ అసలు విధానం మూడు రాజధానులా? మావిగనా? లేక అమరావతి అభివృద్ధికి మద్దతా? అనే ప్రశ్న మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “ఊసరవెల్లి రంగులు మార్చడం పాత పద్ధతి… కానీ గతాన్ని, భవిష్యత్తును బట్టి నిమిషానికో మాట మార్చడం వైసీపీ కొత్త విధానం” అంటూ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates