మూసీ ప్రక్షాళన నా జీవిత లక్ష్యం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవిత లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా, ఎవరు సహకరించకున్నా కూడా మూసీని ప్రక్షాళన చేసి తీరతానని ఆయన ప్రతినబూనారు. ఈ మేరకు ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూసీ నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మూసీ నది ప్రక్షాళనతోనే నల్లగొండ జిల్లా ప్రజలకు విముక్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన నదుల ప్రక్షాళన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గుజరాత్ లో సబర్మతీ ప్రక్షాళన, ఢిల్లీలో యమునా ప్రక్షాళన, ఉత్తర ప్రదేశ్ లో గంగా ప్రక్షాళనల కోసం చేపట్టిన ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ తలమానికంగా మూసీ ప్రక్షాళనను చేపడతామని ఆయన చెప్పారు.

ఇకపై దేశానికి ఎవరు వచ్చినా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును సందర్శించి తీరాల్సిందేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యావత్తు దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళనను చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తన జీవిత లక్ష్యంగా పేర్కొన్న రేవంత్… ఈ ప్రాజెక్టును చేపట్టి తీరతానని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏ ఒక్కరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏ ఒక్కరు సహకరించకున్నా.. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతానని ఆయన ప్రకటించారు.

సబర్మతి, యమునా, గంగా నదుల ప్రక్షాళన ప్రాజెక్టులను ప్రస్తావించిన సందర్భంగా ప్రదాని మోదీ, యూపీ సీఎం యోగిల పేర్లను ఆయన గుర్తు చేశారు. ఆయా ప్రాజెక్టులను చేపట్టిన నేతలు తమ ప్రత్యేకతను చాటుకున్నారన్న రేవంత్… మూసీ ప్రక్షాళన ద్వారా తనకూ ఆ మేర గుర్తింపు వచ్చే దిశగా పనిచేస్తానని అన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు అడ్డు పడేవారికి రేవంత్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారిని మూసీలోనే వేసి తొక్కుతానంటూ రేవంత్ సంచలన వ్యాఖ్య చేశారు.