బండికి బెంగ పోయిన‌ట్టేనా?

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ కు ప‌ద‌వీ గండం తొల‌గిపోయిన‌ట్టేన‌ని జాతీయ మీడియా స‌హా.. బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కేంద్ర మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బీజేపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ నెల‌లోనే అంటే.. కొద్ది రోజుల్లోనే ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం .. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న సోమ‌వారం నాటికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆయ‌న రాగానే అదే రోజు లేదా ఈ నెల 30 నాటికి మంత్రి వ‌ర్గ మార్పు ఉంటుంద‌ని జాతీయ మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోం ది.

ఇటీవ‌లే ప్ర‌ధాని మోడీ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌పైనే ఆమెతో చ‌ర్చించిన‌ట్టు కూడా వార్త‌లు రాగా.. తాజాగా మ‌రో విష‌యం వెలుగు చూసింది. మంత్రుల కూర్పుపై ప‌లు పేర్ల‌తో కూడిన జాబితాను కూడా రాష్ట్ర‌ప‌తికి ప్ర‌ధాని అందించార‌ని జాతీయ మీడియా తెలిపింది. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ చోటు ఏమాత్రం చెదిరిపోద‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఇటీవ‌ల బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌.. కేంద్ర మంత్రిగా సంజ‌య్‌ను త‌ప్పిస్తార‌న్న చ‌ర్చ సాగింది.

కానీ, ఈ విష‌యంలో బండి ప్ర‌మేయం లేద‌ని.. ఆయ‌న పార్టీకి చేసిన సేవ‌ల నేప‌థ్యంలోనే ప‌ద‌వి ల‌భించింద‌న్న వాద‌న ఉంది. పైగా.. పార్టీకి కుటుంబ వ్య‌వ‌హారాల‌కు కూడా సంబంధం లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ సీటు విష‌యంలో ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని తెలుస్తోంది. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి మొత్తం ఐదుగురు మంత్రులు ఉండ‌గా.. బండి సంజ‌య్‌ను అలానే కొన‌సాగించినా.. మిగిలిన న‌లుగురి విష‌యంలో మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడును ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా(ఇండిపెండెంట్ )గా పంపించే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగా చెబుతున్నారు.

ఇక‌, తెలంగాణ‌కు చెందిన కిష‌న్‌రెడ్డిని ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా పంపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కిష‌న్ రెడ్డి గ‌నుల శాఖ మంత్రిగా ఉన్నారు. అలానే.. గుంటూరు ఎంపీ, కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ విష‌యంలోనూ మార్పు ఉండే అవ‌కాశం ఉంద‌ని.. ఆయ‌న‌ను కూడాహోం శాఖ ప‌రిధిలోకి తీసుకుంటార‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీ నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ శ్రీనివాస వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం కేంద్ర ఉక్కు శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌ను కూడా మార్పు చేసి.. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ స‌హాయ మంత్రిగా పంపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తంగా ఈ మార్పులు చేర్పులు ఉండ‌డం మిన‌హా మంత్రుల‌ను త‌ప్పించే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.