వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇటీవల కాలంలో పలు అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. పీపీపీ నుంచి సాయికృష్ణ మిస్టరీ వరకు అనేక అంశాలు దీనిలో ఉన్నాయి. దీనిలో వేటిలోనూ వైసీపీ పైచేయి సాధించలేదన్న విషయం తెలిసిందే. అయినా.. పైచేయి తమదేనని పదే పదే చెబుతున్న జగన్.. తాజాగా స్మార్ట్ కిచెన్ల గురించి కీలక వ్యాఖ్యలుచేశారు. వీటి ద్వారా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న అక్కచెల్లెమ్మల ఉపాధి పోతుందని.. వారు వీధిన పడతారని జగన్ అంటున్నారు. వీరి తరఫున ఉద్యమం చేస్తానని అంటున్నారు.
మరి వాస్తవం ఏంటి?
జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, రాజకీయాలను కొంచెం పక్కన పెడితే.. అసలు ఈ స్మార్ట్ కిచన్ అంటే ఏంటి? ఇది మంచిదా? కాదా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజన పథకం నడుస్తోంది. దీనిని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ప్రవేశ పెట్టారు. విద్యార్థులు ముఖ్యంగా కూలిపనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు.. స్కూళ్లను మధ్యలోనే వదిలి వేయకుండా చూసేందుకు ఈపథకాన్ని తీసుకువచ్చారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా తొలినాళ్లలో 10 శాతం ఉంటే.. ప్రస్తుతం 30 శాతానికి చేరింది.
ఏపీలో ఈ పథకాన్ని మరింత ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజనం ప్రచార అస్త్రంగా మారింది. నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందిస్తామని కూటమి పాలకులు ఎన్నికలకు ముందు చెప్పారు. ఈ క్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో దీనిని అమలు చేస్తున్నారు. నాణ్యమైన భోజనంతోపాటు.. పౌష్ఠికాహారం కూడా అందిస్తున్నారు. వారంలో రెండు సార్లు మాంసాహారంతోపాటు..మూడు రోజులు గుడ్లు కూడా అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈవిధానంలో మార్పులేకపోయినా.. పద్ధతిలో మార్పు తీసుకువచ్చారు.
మండలం లేదా.. క్లస్టర్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు ఒకే చోట భోజనం తయారు చేసి.. వాటిని వాహనాల్లో పంపిస్తారు. వీటినే స్మార్ట్ కిచెన్ అంటున్నారు. అంటే.. ఇకపై స్కూళ్లలోనే పొయ్యిలు పెట్టి.. అక్కడే వంట చేయరు. దీనివల్ల నాణ్యమైన ఆహారం తయారు చేయడంతోపాటు మరింత జవాబు దారీతనం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఇక్కడ ప్రధాన ప్రశ్న.. ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలే పిల్లలకు వంట చేసి పెడుతున్నారు. మరి వీరి సంగతి ఏంటి? అనేది కీలక అంశం. దీనిపై ప్రభుత్వం అలాగే మంత్రి లోకేష్ కూడా ఇటీవల వివరణ ఇచ్చారు.
క్లస్టర్లలో ఏర్పాటుచేసే కిచెన్లలోనే వీరికి కూడా పని కల్పిస్తామని చెప్పారు. అలాగే వీరికి ప్రస్తుతం ఇస్తున్న భత్యం, జీతంలో ఎలాంటి మార్పులు ఉండబోవని కూడా చెప్పారు. కేవలం వంట చేసే ప్రాంతం మాత్రమే మారుతుందని.. ఉపాధి పోవడం అనేది ఉండదని చెబుతున్నారు. అయినప్పటికీ.. అసలు విషయాన్ని మరుగున పడేస్తున్న జగన్.. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరో చిత్రమైన విషయం ఏంటంటే.. స్మార్ట్ కిచెన్లకు తాము వ్యతిరేకమని ఎక్కడా ఎవరూ చెప్పలేదు. కేవలం తమకు రెండు నెలలుగా జీతాలు రాలేదని.. వాటిని ఇవ్వాలని మాత్రమే వంట చేస్తున్న వారు కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates