రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా కాలం తర్వాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించిన వైసీపీ, ఇప్పుడు సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో మరోసారి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజధాని భూముల పరిశీలనకు వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డితో పాటు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులమంటూ కొందరు మంగళవారం ఉదయం బయలుదేరారు. ఉండవల్లి సెంటర్ వద్ద రాజధాని రైతులు, టీడీపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ‘వైసీపీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో లేళ్ల అప్పిరెడ్డి కారు ధ్వంసమైంది. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు కాగా, ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
రాజధానిగా అమరావతిని పూర్తిగా అంగీకరించిన తర్వాతే ఇలాంటి పర్యటనలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉండవల్లి సెంటర్లో ధర్నా నిర్వహించారు. మరోవైపు, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకే భూముల పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చామని వైసీపీ నేతలు తెలిపారు. భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని, వ్యవసాయం చేయకుండా భూముల చుట్టూ మట్టి తవ్వేసిందని ఆరోపిస్తూ వాటిని పరిశీలించేందుకు వచ్చిన తమపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.
ఈ ఘటనతో అమరావతి ప్రాంతంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నామని చెబుతుండగా, మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు సృష్టించి రాజధాని ప్రాంతంలో అలజడి రేపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates