మాకు ఆంధ్రా తెలంగాణ ఉండదు: లోకేష్

ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య ప్రాంతీయ‌త‌, రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించిన వివాదాలు తీవ్రంగా సాగుతున్న స‌మ‌యంలో కీల‌క విషయం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్‌లో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన యువ‌తులు లీడ్ రోల్ పోషిస్తున్న విష‌యం వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఏపీ-తెలంగాణ ప‌రిధులు.. హ‌క్కుల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇద్ద‌రు తెలంగాణ బిడ్డ‌లు ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. త‌మ‌కు ప్రాంతాల‌తో ప‌నిలేద‌ని పేర్కొన్నారు.

ఎవ‌రు ఎక్క‌డ నుంచి వ‌చ్చార‌ని తాము ప‌రిశీలించ‌బోమ‌ని మంత్రి అన్నారు. ప‌రిధులు లేని అభివృద్ధి, విజ్ఞాన‌మే త‌మ‌కు కీల‌క మ‌ని వ్యాఖ్యానించారు. తాము అడిగేది కేవ‌లం టాలెంట్ మాత్ర‌మేన‌ని.. రాష్ట్రాలు, ప్రాంతాలు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని.. ఎవ‌రైనా రావొచ్చ‌ని.. ఏపీలో ఉండొచ్చ‌ని, ఇక్క‌డి అభివృద్ధిలో భాగ‌స్వామ్యం కావొచ్చ‌ని తెలిపారు. రాష్ట్రాలు వేరైనా.. జ్ఞానం పంచేందుకు పెంచేందుకు ఇక్క‌డ ఉన్న వ‌న‌రుల‌కు ఉప‌యోగ‌పడేవారికి.. ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేసేవారికి తాము ఎప్పుడూ స్వాగతం ప‌లుకుతూనే ఉంటామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ర‌త‌న్ టాటాఇన్నోవేష‌న్ హ‌బ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త‌ను ఎంక‌రేజ్ చేసేందుకు, వినూత్న ఆలోచ‌న‌ల‌తో రాష్ట్రంలో ప్రాజె క్టులు ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. దీనిలో యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన ప్ర‌ధాన ఇన్నోవేష‌న్ కేంద్రంలో ప‌నిచేస్తున్నారు. ఈ విష‌యాన్ని.. తాజాగా ఓ వ్య‌క్తి వెలుగులోకి తీసుకువ‌చ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారిణి ధాత్రి రెడ్డి పక్కా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.

ఆమెతో పాటు ఈ ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్న దీప్తి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు తెలంగాణ బిడ్డలు.. ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. దీనిపై చ‌ర్చ ప్రారంభం కాగా.. వివాదా నికి దారితీయ‌కుండా మంత్రిలోకేష్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్రాంతాల‌తో సంబంధం లేద‌న్నారు. అభివృద్ధికి, సుప‌రిపాల‌న కు మాత్ర‌మే తాము ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రు క‌లిసి వ‌చ్చినా.. త‌మ వంతు సాయం, ప్రోత్సాహం అందిస్తామ‌ని మంత్రి లోకేష్ స్ప‌ష్టం చేశారు.