వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణను సాయం కోరారా? జగన్ కోరితే… ఆ మేర సాయం చేసేందుకు బాలయ్య అప్పటికప్పుడే ఒకే అనేశారా? ఉప్పూనిప్పు మాదిరిగా ఉండే ఈ ఇద్దరి మధ్య మాటలు కూడా కలిశాయా? జగన్ సాయం కోరితే.. బాలయ్య చేయందించారా?… ఇన్నేసి డౌట్లు ఒకేసారి వచ్చేశాయి. అయితే డౌటేమీ లేదు. బాలయ్యను జగన్ సాయం కోరారు. బాలయ్య కూడా ఆ సాయం చేశారు. ఫలితంగా ఓ ఆడబిడ్డ జీవితం పదిలంగా నిలబడింది.
జగన్, బాలయ్యల మధ్య జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. అనంతపురం జిల్లాకు చెందిన స్వప్న అనే యువతికి బోన్ కేన్సర్ సోకిందట. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడే ఈ వ్యాధి రాగా… ఆమెకు జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయిందట. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సతో ఆ బాలిక ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని వైద్యులు చెప్పారట. ఈ క్రమంలో ఒకానొక రోజు జగన్ వారి ఇంటికి వెళ్లారట. ఆ సందర్భంగా ఆ బాలిక అనారోగ్యం గురించి, వైద్యుల సలహా గురించి తెలుసుకుని ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారట.
దివంగత నందమూరి తారకరామారావు స్థాపించిన బసవతారకం ఆసుపత్రి ప్రస్తుతం బాలయ్య ఆధ్వర్యంలోనే నడుస్తోంది కదా. మరి ఈ ఆసుపత్రిలో చికిత్స కావాలంటే… అది కూడా ప్రత్యేక పర్యవేక్షణతో చికిత్స కావాలంటే బాలయ్య సాయం కోరాల్సిందే. అంతే.. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా జగన్ తన వాళ్లతో బాలయ్యతో మాట్లాడించారట. సదరు బాలికకు వైద్యం అందించాలన్న జగన్ కోరికను జగన్ పరివారం ద్వారా విన్న బాలయ్య అందుకు సరేనన్నారట. ఇంకేముంది స్వప్నకు బసవతారకం ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స లభించింది. బోన్ కేన్సర్ నయం అయిపోయింది. ఆ బాలిక ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా చలాకీగా జీవిస్తోంది.
ఈ విషయాన్ని స్వప్ననే స్వయంగా వెల్లడించింది. బసవతారకం ఆసుపత్రి ఏర్పాటు అయి సోమవారం నాటికి 25 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా బసవతారకం రజతోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్ లో ఘనంగా జరగగా.. ఈ వేడుకలకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్వప్న జగన్, బాలయ్యల మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనను కళ్లకు కట్టేలా చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates