చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్ పాయింట్. ఒకరు ఓటిటి అని మరొకరు పైరసీ అని ఇలా ఎవరికి వారు దీనికి భాష్యాలు చెబుతూనే ఉంటారు. తాజాగా రామ్ చరణ్ ఒక పబ్లిక్ స్టేజి మీద తన అభిప్రాయాన్ని పంచుకుంటూ కోవిడ్ తర్వాత కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార, పుష్ప 2 లాంటి సినిమాలు చూసేందుకు పబ్లిక్ తరలి వచ్చారని, ఇప్పటికీ మన దేశంలో చీప్ గా దొరికే వినోదం సినిమా అని చెప్పాడు.

అంతేకాదు పాప్ కార్న్ ధరలు ఇంకొంచెం తగ్గిస్తే మరింత మెరుగైన ఆక్యుపెన్సీలు చూడొచ్చని అన్నాడు. సినిమా టికెట్ రేట్లు అందుబాటులోనే ఉన్నాయనేది రామ్ చరణ్ అసలు ఉద్దేశం. తన లాజిక్స్ ని కొంచెం విశ్లేషిస్తే పూర్తిగా ఏకీభవించలేం. ఎందుకంటే పాప్ కార్న్ తినడం కోసమే సినిమాలకొచ్చే జనాలు తక్కువ. ఏసీ కోసమైనా వస్తారేమో కానీ తింటూ ఎంజాయ్ చేద్దామని భావించే సంఖ్య పది శాతం లోపే ఉంటుంది. అలాంటప్పుడు వాటిని పెంచినా తగ్గించినా విపరీతమైన తేడా ఉండదు.

ముందు కంట్రోల్ చేయాల్సింది టికెట్ రేట్లు. మన దేశంలో చీప్ ఎంటర్ టైన్మెంట్ ముమ్మాటికీ సినిమా కాదు. ఏపీ తెలంగాణ పక్కనపెడితే ఒడిస్సి అనే ఇంగ్లీష్ మూవీని ఐమాక్స్ లో చూడాలంటే ఆరు వందల నుంచి రెండు వేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవాలి. బడ్జెట్ పేరు చెప్పి పెద్ది ప్రీమియర్ షోకు ఆరు వందలు తీసుకున్నారు, పది రోజుల పాటు 125 రూపాయల పెంపును వాడుకున్నారు. ఈ ధోరణి అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకున్నది కాదు కదా.

పాప్ కార్న్ ధరలు తగ్గించడం మంచిదే. దానితో పాటు పెద్ద హీరోల సినిమాలకు కొంత నియంత్రణ కూడా అవసరం. బడ్జెట్లు, రెమ్యునరేషన్లు, గ్రాఫిక్స్, టైం ప్రకారం షెడ్యూల్స్ ఇలా ఎన్నో విషయాల్లో మార్పులు వస్తే నిర్మాత ఊపిరి పీల్చుకుంటాడు. రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ప్యాన్ ఇండియా సినిమాలు ఒక్క టాలీవుడ్ లోనే ఆరేడు ఉన్నాయి. వాటికి బాద్యులు ప్రేక్షకులు కాదు. ముమ్మాటికీ హీరోలు దర్శకులే. సో పాప్ కార్న్ తో పాటు ఈ సమస్యలు కూడా పరిష్కారం అయితే థియేటర్లు ఇంకా పచ్చగా ఉంటాయి.