రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల పేరిట హద్దు దాటి ప్రవర్తించరాదు కూడా. తనకంటూ ఓ పరిధిని గీసుకుని… దానిని నిత్యం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగే వారే నేతలుగా రాణిస్తారు. అలాంటి వారి వల్ల వారు కొనసాగే పార్టీలకు మంచి గుర్తింపు దక్కుతుంది. ప్రజల నుంచి ఆదరణా లభిస్తుంది. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఈ తరహా నేతలు అంతకంతకూ తగ్గిపోతున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన నేత పంతం వెంకటేశ్వరరావు అలియాస్ పంతం నానాజీ తాజా వ్యాఖ్యలు జనసేనకు ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి.
విజయవాడలో కాపు యువకుడు సాయి కృష్ణ అదృశ్యం, దానిని ఆధారం చేసుకుని కూటమి సర్కారుపై విపక్ష వైసీపీ ఓ రేంజి ఆరోపణలు గుప్పించడం, వాటికి కౌంటర్ గా రెండు రోజుల క్రితం కాకినాడ వేదికగా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదనాభరిత ప్రసంగం, ఆ మరునాడే రామచంద్రాపురంలో వైసీపీ కాపు నేతల సమావేశం, దానిపై జనసేన విమర్శలు, ఆ విమర్శలకు వైసీపీ నుంచి విచిత్రమైన రీతిలో ప్రతి విమర్శలు… వాటిపై తాజాగా పంతం నానాజీ ఏకంగా సహనం కోల్పోయి తన పార్టీనే ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేసిన వైనం వెంటవెంటనే జరిగిపోయాయి.
కుల భావనను పక్కనపెడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పవన్ అంటే… ఆ మాటను ఆధారం చేసుకుని వైసీపీ ఓ రేంజిలో దాడి మొదలుపెట్టింది. అంతేకాకుండా కుల భావన వద్దన్న పవన్ పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారని కూడా ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అంతేకాకుండా కుల భావనను వీడాలంటే ముందుగా పవన్ పిఠాపురం తప్పించి ఇతర ప్రాంతాల్లో పోటీ చేయరాదన్న డిమాండ్ కూడా వైసీపీ నుంచి వినిపించంది. ఈ విమర్శలు విన్నంతనే నానాజీకి పట్టరాని కోపం వచ్చేసింది. ఆ వాదనన ఖండించేందుకు సోమవారం ఆయన నేరుగా మీడియా ముందుకు వచ్చారు. పిఠాపురం నుంచి మాత్రమే పవన్ పోటీ చేయాలనడానికి మీరెవ్వరని మొదలు పెట్టిన ఆయన ఆ వెంటనే సహనం కోల్పోయారు.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే తన నియోజకవర్గం పులివెందులను, కడప జిల్లాను వదిలి రమ్మనండి అంటూ మొదలుపెట్టిన నానాజీ… దమ్ముంటే జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. తన సొంత నియోజకవర్గం కాకినాడ రూరల్ లో జగన్ పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. ఈ సందర్భంగా నానాజీ నోట నుంచి ఆ “నా కొడుకు”, మరికొన్ని అసభ్య పదాలు అలా దొర్లిపోయాయి.
ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా నానాజీ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు. తన మాటలను సమర్ధించుకునే నిమిత్తం ఆయన కడప జిల్లాలో ప్రత్యేకించి పులివెందులలో ఎన్నికలు ఎలా జరుగుతాయన్న విషయాన్ని ఆయన ఉదాహరణలతో సహా వివరించారు. ఈ వాదన సరిగానే ఉన్నా… ఓ ఎమ్మెల్యేగా ఉంటూ ఓ పార్టీ కీలక నేతపై ఇలా దురుసు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. అయినా పవన్ చెబుతున్నదేమిటి?… జనసేన నాయకులు చేస్తున్నదేమిటి? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates