వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స స‌త్య‌నారాయణ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. `ఒక‌రినొక‌రు ఓదార్చుకుందాం. బాధ‌లు పంచుకుందాం“ అని అనేస‌రికి స‌భ‌కు వ‌చ్చిన కాపులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అస‌లు స‌మావేశం ఉద్దేశం ఏంటి.. బొత్స చేసిన వ్యాఖ్య‌లు ఏంట‌ని వారు ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకున్నారు. దీంతో తేరుకున్న బొత్స‌.. త‌న ఉద్దేశం.. కాపులంతా అండ‌గా ఉండాల‌ని చెప్ప‌డ‌మేన‌ని స‌రిదిద్దుకున్నారు.

ఇటీవ‌ల కాపుల విష‌యంలో వైసీపీ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు వేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా కాపుల‌కు అన్యాయం జ‌రుగుతున్నా.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. కాపుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. త‌ద్వారా కూట‌మి స‌ర్కారుకు కాపుల‌ను దూరం చేయాల‌న్న ఎత్తుగ‌డ ఉంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం కొన‌సాగుతుండ‌గానే.. విజ‌య‌వాడ‌లో సాయికృష్ణ అనే యువ‌కుడు అదృశ్యం కావ‌డం.. పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో కాపుల వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది.

సాయికృష్ణ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడే అయినా.. ప‌వ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైసీపీ నాయ‌కులు పేర్కొన్నారు. ఇలా.. ఒక‌రిపై ఒక‌రు కాపు సెంట్రిక్‌గా రాజ‌కీయాలు చేసుకుంటున్న స‌మ‌యంలోనే వైసీపీ తాజాగా తూర్పు గోదావ‌రిలో కీల‌క కాపు స‌మావేశం నిర్వ‌హించింది. దీనికి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కులు అంద‌రూ హాజ‌ర‌య్యారు. అయితే.. ప్ర‌ధానంగా చ‌ర్చించింది.. కాపులంతా ఐక్యంగా ఉండాల‌ని.. వైసీపీ త‌ర‌ఫున ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌ద‌ర్భంగా ప‌లు తీర్మానాల‌ను ఆమోదించారు.

వీటిలో ప్ర‌ధానంగా కాపు స‌మాజాన్ని వైసీపీకి అనుకూలంగా మలిచేందుకు ఇలాంటి స‌మావేశాలు తిరుప‌తి, విజ‌య‌వాడ స‌హా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. కాపుల‌కు జ‌రుగుతున్న అన్యాయం, నిర్బంధంపై గ‌ళం గ‌ట్టిగా వినిపించాల‌ని తీర్మానించారు. కులాల‌కు రాజ‌కీయాల‌కు మ‌ధ్య సంబంధం లేద‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కులు త‌ప్పుబ‌ట్టారు. కులాల ప్రాతిప‌దిక‌నే ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నార‌ని.. మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇక‌, త‌మ హ‌యాంలోనే కాపుల‌కు న్యాయం జ‌రిగింద‌ని.. ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారు కాపుల‌కు ద్రోహం చేసింద‌ని.. ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శించారు.

సాయంపై త‌ల‌కో మాట‌!

విజ‌య‌వాడ‌లో మృతి చెందార‌ని భావిస్తున్న సాయికృష్ణ కుటుంబానికి కాపులంతా.. అండ‌గా ఉండాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. తాజాగా నిర్వ‌హించిన స‌మావేశానికి వ‌చ్చిన కాపులంతా.. ఒక్కొక్క‌రు 50 వేల రూపాయ‌ల చొప్పున వేసుకుని ఆ సొమ్మును సాయికృష్ణ తల్లికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కేసు తేల‌కుండానే… సాయికృష్ణ ఉన్నాడో లేడో అనే విష‌యంపై క్లారిటీ లేకుండా సాయం ఎందుక‌ని కొంద‌రు ప్ర‌శ్నించారు. దీంతో ఈ విష‌యాన్ని త‌ర్వాత చూద్దామ‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.