ఎవరూ తనను అర్ధం చేసుకోవడం లేదంటూ.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. సొంత పార్టీ నేతల గురించేనన్నది సుస్పష్టం. ఈ విషయంలో ఆయన నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలనే ప్రస్తావించారు. ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు… ఎంపీలు ఉన్నారు.. అయినా తనను అర్ధం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆవేదన, ఆక్రోశం.. అంతా పార్టీ నేతల చుట్టూనే తిరిగింది.
ఎందుకు?
జనసేన పార్టీ సిద్ధాంతాలు వేరు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే.. అధికారమే పరమావధిగా జనసేన ఏర్పడలేదు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో పార్టీ పుట్టింది. అందుకే.. పార్టీ పెట్టిన 6 సంవత్సరాల వరకు అసలు పోటీనే చేయలేదు. ఆ తర్వాత 2019లో పోటీ చేసినా.. ఓడిపోయినా.. బలంగా నిలబడడానికి సైద్ధాంతిక మూలమే కారణం. కానీ.. దండలో దారం మాదిరిగా ఉన్న ఈ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవడంలోనే నాయకులు తడబడుతున్నారన్నది వాస్తవం.
ఇక్కడ మరో విషయం చెప్పాలి.. జనసేన పార్టీలో ఇప్పుడున్న నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ.. సంస్థా గతంగా పార్టీ కోసం ఏర్పడిన వారు.. వచ్చిన వారు కాదు. దాదాపు 80 శాతం మంది నాయకులు, కార్యకర్తలు.. పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారే. ఇది కూడా.. పవన్ ను అర్ధం చేసుకునే విషయంలో ప్రభావం చూపిస్తోందన్న వాదన ఉంది. దీంతో పాటు.. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి కార్యకర్తల కొరత పార్టీని వెంటాడుతోంది. నిస్వార్థంగా పనిచేసే నాయకుల కొరత కూడా కనిపిస్తోంది.
ఇలా.. అనేక విషయాల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యూహాలు.. ఆయన సిద్ధాంతాలు.. దూరదృష్టి వంటివి నాయకులకు, కార్యకర్తలకు చేరేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. అసలు నోరే విప్పడం లేదని.. ప్రతిపక్షం ఇంత యాగీ చేస్తున్నా.. తనను సైతం దూషిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదన పవన్ కల్యాణ్లో కనిపించింది. అదే.. ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. మరి ఎంత మంది నాయకులు మారుతారు? పవన్ ను అర్ధం చేసుకుంటారు? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates