ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం ఏపీలో ఆ ఒక్క పార్టీకి మాత్రం పట్టకపోవడం ఆశ్చరంగానే ఉంది. ఇటువంటి ఘటనలు జరిగినపుడు సహజంగా పార్టీలు అప్రమత్తం అవుతాయి. మైలేజీ కోసం కూడా చూస్తాయి. పరామ్శలు, డిమాండ్లు చేస్తాయి. కానీ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు ఇంత హాట్టాపిక్గా మారినా కాంగ్రెస్పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎందుకో సైలెంగ్గా ఉండిపోయారు. కొద్దొగొప్పో ఉన్న ఆ పార్టీ సానుభూతిపరుల్లో ఈ ప్రశ్న తలెత్తుతోంది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మే 9న కృష్ణలంక పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత కనిపించకుండా పోయాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో, ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కూడా విచారణలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సాయి ఇంటికి వెళ్లి అతని తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. సీబీఐ ఎంక్వయిరీకి కూడా డిమాండ్ చేశారు.

ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న సీఐని సస్పెండు చేయడమే కాకుండా, ఒక ఎంక్వయిరీ కమిటీ కూడా వేశారు. మరీ ముఖ్యంగా ఈ రోజు ఆయన బాధిత కుటుంబాన్ని పిలిపించుని మాట్లాడారు. వారికి ఎంతోకొంత భరోసా కల్పించారు. ఏపీలో ఉన్న చిన్నా చితకపార్టీలు కూడా సాయికృష్ణ అంశంపై మాట్లాడాయి.

అయితే ఈ మధ్య కాలంలో బీజేపీపై, అంతకు ముందు వైసీపీపై ఒంటికాలిపై లేచిన షర్మిల మౌనంగా ఉండిపోయారు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. పైగా పొలిటికల్గానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఇది స్పందించాల్సిన అంశం. లాకప్ డెత్ అనే తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో షర్మిల కనీసం మాట్లాడలేదు. మరోవైపు తనకు రాజ్యసభ సీటు దక్కనప్పటి నుంచి షర్మిల కొంత రాజకీయంగా మౌనంగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా ఇస్తున్నాయి. ఇటువంటి సీరియస్ఘటనలపై స్పందించకపోతే.. ఎప్పటికీ ఆ పార్టీ అక్కడే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన..!