రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్… తాజాగా రాష్ట్రానికి ఆరు పులులను పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పులుల సంతతి తగ్గిపోతోందని.. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఆరు ఆడపులులను పంపిస్తే.. రాష్ట్రంలో పెరిగే పులుల సంతతిని.. దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని నల్లమలలో పులుల సంచారం ఎక్కువ. అయితే.. గత కొన్నాళ్లుగా వీటి సంతతి తగ్గుతోంది. అడవుల ఆక్రమణ, రహదారుల నిర్మాణం.. వాతావరణ మార్పులతో పులుల సంఖ్య తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై ఆయన చర్చించారు.
ఏపీలోని పలు ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చించారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్లో బేస్ క్యాంపులు పెంచాలని కోరారు. బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం కేంద్ర సహకారానికి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులను అరికట్టడం కోసం . ‘హనుమాన్’ ప్రాజెక్ట్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాని వివరాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు. అదేసమయంలో అడవుల్లో బేస్ క్యాంపుల నిర్మానం కోసం.. కేంద్రం నుంచి నిధులు కోరారు.
ఇక, నల్లమలలో పులుల సంతతి పెంచేందుకు వీలుగా.. మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 2 ఆడ పులులను ఏపీకి పంపించాలని కోరారు. తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులుల సంతతి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కాగా.. గతంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటి ద్వారా అడవులపై దాడులు చేసే ఏనుగులను తరిమి కొట్టడంతోపాటు.. ఏనుగులను హింసించకుండా వన్యప్రాణి రక్షణకు పవన్ ప్రయత్నం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates