హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్.. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మహిళ అని చూడకుండా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరి విమర్శలకు గురవుతున్నాయి. ఇటీవల తమ కార్యకర్తల సమావేశంలో గుడివాడ అమర్నాథ్.. అనిత మేకప్గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పైగా తాను వాడి వదిలేసిన బులెట్ప్రూఫ్ వాహనాన్ని ఆమె వాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవే ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.

మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి విమర్శలు చేసేటపుడు హుందాగా వ్యవహరించి ఉండాల్సింది. పైగా తాను ఒక మహిళపై వ్యాఖ్యలు చేస్తున్నాననే విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఇది వారి కార్యకర్తలకు కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశమే. ఈ వ్యాఖ్యలకు కూటమిలోని మహిళా నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. మేకప్ మంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేస్తున్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్చేస్తున్నారు. మాటలు అదుపులో పెట్టుకోకపోతే మహిళలు ఆయన నాలుక కోస్తారంటూ ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడమే అని ఆయన పేర్కొన్నారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారని అన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. నోటి దురుసుతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టాలని ఆయన ఓ ప్రకటనలోసూచించారు.