కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేళ ఈ దాడి జరగడంతో కలకలం రేగింది. ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఒక్కసారిగా దూసుకొచ్చి అభిజిత్ దీప్కే చెంపపై కొట్టినట్లు సమాచారం. అతనితో పాటు మరికొందరు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని పలు నగరాల్లో కాక్‌రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తొలుత ఢిల్లీలో, అనంతరం ఇండోర్‌లో, ఇటీవల హైదరాబాద్‌లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత హాజరై తమ ఆందోళనను వెలిబుచ్చారు.

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది సోషల్ మీడియాలో ఆవిర్భవించిన వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని గత మే 16న అభిజిత్ దీప్కే ప్రారంభించారు. ఆయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వ్యూహకర్తగా పనిచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా ఈ ఉద్యమం ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. నిరుద్యోగ యువతను బొద్దింకలు, సమాజ పరాన్నజీవులుగా అభివర్ణించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పార్టీ ఏర్పడింది. సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అభిజిత్ దీప్కే అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత కార్యరూపం దాల్చింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పార్టీ అనుచరులతో పాటు వ్యతిరేక వర్గాల వారు కూడా పాల్గొన్నారు. అయితే అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

ఇండోర్, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా ముగిశాయి. అయితే జైపూర్‌లో జరిగిన తాజా ఆందోళనలో అభిజిత్ దీప్కేపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.