దేశ‌వ్యాప్తంగా… బొద్దింక‌ల జోరు!

కాక్రోచ్ జ‌నతా పార్టీ(సీజేపీ)గా ఏర్ప‌డి ఉద్య‌మాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్త‌రించే ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తోంది. కొన్ని రోజుల కింద‌ట ఢిల్లీలో మ‌హా నిర‌స‌న పేరుతో తొలి ఉద్య‌మాన్ని చేప‌ట్టిన సీజేపీ దీనిని స‌క్సెస్ చేసింది. ఈ సంద‌ర్భంగానే కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేసింది. వైద్య విద్యా ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన‌ నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను రాజీనామా చేయించాల‌ని ప‌ట్టుబ‌ట్టింది.

ఈ నెల‌ 15 లోగా(మ‌రో రెండు రోజుల గ‌డువు ఉంది) ఆయ‌న రాజీనామా చేయాల్సిందేన‌ని సీజేపీ ప‌ట్టుబట్టింది. లేక‌పోతే.. దేశ‌వ్యాప్తంగా త‌మ ఉద్య‌మాన్ని మ‌రింత విస్త‌రిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆదివారం.. హైద‌రాబాద్‌లో నిర‌స‌న చేప‌ట్టింది. ఇందిరా పార్కులో చేప‌ట్టిన ఈ నిర‌స‌న‌కు రాష్ట్ర పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. దీంతో రాష్ట్రం నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువ‌త త‌ర‌లి వ‌చ్చారు.

మేధావులు ప్ర‌జాసంఘాల నాయ‌కులు కూడా కాక్రోచ్ ఉద్య‌మంలో భాగ‌స్వామ్యమ‌య్యారు. వ‌రుస‌గా దేశంలోని అన్ని ప్ర‌ధాన ప‌ట్ణ‌ణాల్లోనూ ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌నున్నారు. త‌మిళ‌నాడులోని చెన్నైలోను.. క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులోనూ.. నిర‌స‌న‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ ప్ర‌భావం.. సీజేపీ విస్త‌ర‌ణ‌కు మ‌రింత ప్రాచుర్యానికి దోహ‌ద‌ప‌డుతోంది. తాజాగా నిర్వ‌హించిన హైద‌రాబాద్ నిరస‌న‌లో ప‌లువురు మేదావులు.. సీజేపీకి మ‌ద్ద‌తు పల‌క‌డం గమ‌నార్హం.

ఈ నిర‌స‌న‌లో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ స‌హా తెలంగాణ ఉద్య‌మ నాయ‌కులు కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ధ‌ర్మేంద్ర ప్రధాన్ సెంట్రిక్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. నీట్ లాంటి ప‌రీక్ష‌ను కూడా వివాదం చేయ‌డం ద్వారా.. విద్యార్థుల జీవితాల‌తో ఆడుకున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇలా.. దేశ‌వ్యాప్తంగా సీజేపీ విస్త‌రించ‌డం.. దీనికి ప్ర‌జ‌ల‌నుంచి ముఖ్యంగా జెన్‌-జీ నుంచి భారీ మ‌ద్ద‌తు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. రాబోయే రోజుల్లో త‌మ ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో లోక్‌పాల్ ఉద్య‌మం త‌ర‌హాలో సీజేపీ విస్త‌రించ‌డంపై చ‌ర్చ సాగుతోంది.