భూములిచ్చిన గౌరవం… విమానంలో రైతులు, రైతు కూలీలు

అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, మహిళలను తొలి ప్రయాణికులుగా ఆహ్వానించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.

జేవర్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు లక్నో నుంచి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తొలి ప్రయాణికుల విమానంలో ప్రయాణించారు. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని జేవర్ ప్రాంత రైతు కుటుంబాలు విమానాశ్రయం నిర్మాణం కోసం తమ పూర్వీకుల భూములను అందించాయి.

ఒకప్పుడు తాము సాగు చేసిన పొలాలపై నేడు ప్రపంచ స్థాయి విమానాశ్రయం నిర్మితమవడాన్ని రైతులు గర్వంగా వీక్షించారు. తమ భూములపై నిర్మించిన విమానాశ్రయం నుంచే తొలి విమాన ప్రయాణం చేయడం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రైతుల త్యాగం, సహకారం వల్లే ఇటువంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులను తొలి ప్రయాణికులుగా గౌరవించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.