మళ్లీ డీటిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రచ్చను జనం మరిచిపోకముందే…మరోమారు అదే అంశంపై చర్చ మొదలైపోయింది. అంతేకాకుండా మునుపటిలా ఈ దఫా కూడా దీనిపై చర్చ ఓ రేంజిలో జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మాట వెలువడకున్నా.. అప్పుడే డీలిమిటేషన్ భయాలను వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిలో అందరికంటే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రచ్చకు తెర తీశారు.

దేశంలో త్వరలోనే డీలిమిటేషన్ జరగనుందని శుక్రవారం కేటీఆర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వచ్చే నెలలోనే కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తనకు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల విషయం ఎలా ఉన్నా… రాష్ట్ర విభజన జరిగిన తెలంగాణ, ఏపీల్లో మాత్రం సీట్ల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం సీట్ల సంఖ్యను కుదించే దిశగా యత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

అంతటితో ఆగని కేటీఆర్…ఈ విషయంపై తనదైన శైలి రూలింగ్ లు కూడా ఇస్తూ సాగారు. దేశంలో మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ఆయన తనదైన శైలి వ్యాఖ్య చేశారు. మంచి పనితీరు కనబరిచే రాష్ట్రాలు దేశాభివృద్దిలో కీలక భూమికను పోషిస్తాయని చెప్పిన కేటీఆర్… అలాంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక జమిలి ఎన్నికలపైనా తన ఊహాజనిత వ్యాఖ్యలను వదిలిన కేటీఆర్.. జమిలి ఎన్నికలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని చూడాలని అన్నారు.

దేశానికి ప్రదానిగా మోదీ అత్యదిక కాలం కొనసాగి అరుదైన రికార్డు నమోదు చేసిన దరిమిలా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశం ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగగా… డీలిమిటేషన్ విషయంపైనా చర్చ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఏ ఒక్క నేత కూడా నోరు విప్పలేదు. కేవలం ఊహాజనితవార్తల ఆదారంగా కేంద్రం డీలిమిటేషన్ బిల్లు పెడుతోందని, అందులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి.