ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పార్టీల జోరు.. ఇండియా కూటమి వేస్తున్న అడుగులను నిశితంగా గమనిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాలు.. ప్రస్తుత కూటమిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
దీనిలో భాగంగా దక్షిణాదిలో తమకు కీలక పార్టీలుగా ఉన్నటీడీపీ, జనసేనలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రధానంగా టీడీపీకి ఒక గవర్నర్ పోస్టును.. లేదా కేంద్ర మంత్రి వర్గంలో మరో బెర్త్ను ఆఫర్ చేసినట్టు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిని ఒక ఎంపీ కూడా ధ్రువీకరించారు. చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్. మేం రెండూ కావాలని అడుగుతున్నాం. అని ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత లెక్క ప్రకారం చూస్తే.. టీడీపీకి రెండు మంత్రి పదవులు ఉన్నాయి. గుంటూరు ఎంపీ చంద్రశేఖర్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. ఇక, గవర్నర్పోస్టుల విషయానికి వస్తే.. గోవా గవర్నర్గా విజయనగరం మాజీ ఎంపీ.. పూసపాటి అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కేంద్రమంత్రి పదవితోపాటు.. మరో గవర్నర్ సీటును కూడా టీడీపీ ఆశిస్తున్న విషయం ఇటీవల కాలంలో చర్చకు వస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి టీడీపీ కీలక మద్దతు దారుగా ఉంది.
ఈ నేపథ్యంలో తమకు మరో రెండు పదవులు కావాలని.. కొన్నాళ్లుగా చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాబు కోరికను మన్నించి.. కూటమికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సహా కీలక నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక గవర్నర్ లేదా.. ఒక మంత్రి పదవిని ఇస్తామని చెప్పారని తెలిసింది. దీనిపై తన పార్టీ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని బాబు కూడా రిప్లయి ఇచ్చారని సమాచారం. ఇక, పార్టీ వర్గాల కథనం మేరకు రెండూ కావాలన్నది చంద్రబాబు ఉద్దేశం. దీనిని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
