స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
కానీ.. దీనిని కూడా వైసీపీ నాయకులు రాజకీయాలకు వాడేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. వాస్తవానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరూ కలివిడిగా వ్యవహరించి..బాధితులకు అండగా.. వారికి భరోసా కల్పించేలా వ్యవహరించాలి. కానీ, దీనికి భిన్నంగా వైసీపీ నాయకులు నారా లోకేష్ పర్యటనపై విమర్శలు చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాలన్న కార్మిక సంఘాలను నారా లోకేష్ ఏదో అన్నారని.. లోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
వాస్తవానికి కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, మరీ ముఖ్యంగా బాధితుల పక్షాన నిలబడడాన్ని ఎవరూ తప్పు బట్టరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని కూడా ఎవరూ అనరు. అంతేకాదు.. బాధితులకు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో పరిహారం ఇప్పించే ప్రయత్నం చేయడాన్ని కూడా ఎవరూ తప్పుగా చూడరు. వైసీపీ స్థానంలో టీడీపీ ఉన్నా.. బాధితుల పక్షానే నిలబడుతుంది. కానీ.. దీనికి కూడా సమయం, సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. విశాఖ ప్లాంట్ ఘటనలో తప్పు ప్రభుత్వానిదా? అంటే కాదు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిందని సాక్షాత్తూ కేంద్ర మంత్రే చెప్పారు. పోనీ.. ఈఘటన.. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనల కారణంగా జరిగిందా? అంటే.. దీనికి రాష్ట్ర సర్కారుకు సంబంధం లేదు. అయినప్పటికీ.. ఈ ఘటనను ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి లోకేష్కు ముడిపెట్టి.. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేయడం.. బాధితులను పరామర్శించడాన్ని కూడా తప్పుపట్టేలా మాట్లాడడం వంటివి సరికాదని అంటున్నారు.
ఏదైనా ఉంటే.. సమయం చూసుకుని ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చని.. ప్రతిపక్ష(ప్రధానకాదు) పార్టీగా వైసీపీ తరఫున కూడా బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నించవచ్చని చెబుతున్నారు. కానీ, ఈ బాధ్యతలను మరిచిన గుడివాడ.. మీడియా సమావేశాలు పెట్టి మంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడంపై విశాఖ వాసులే.. నవ్విపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates