రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న ఆయన… ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పలకరించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన సందర్శించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా… మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యరు. వీరు నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామర్శించి… ప్రమాదం జరిగిన తీరుతెన్నులు, ప్రమాదం జరగడానికి గల కారణాలను ఆరా తీసేందుకే జగన్ విశాఖ పర్యటనకు వస్తున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే… విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వైసీపీ నేతలు సోమవారమే ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియకుడానే… దానిలోకి రాజకీయం చేసే యత్నం చేశారు. తాజాగా మంగళవారం శాసనమండలిలో ప్రదాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కేకే రాజు తదితరులు బాదితులను పరామర్శించారు. ఈ సందర్భంగానే వారు జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మరోవైపు జగన్ విశాఖకు వస్తున్నారనగానే… జనంలో ఓ రకమైన భావన వ్యక్తమవుతోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు జగన్ తీసుకున్న చర్యలపై వైసీపీ అనుకూలురు మాట్లాడుతుంటే… ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులు ఇప్పుడెలా ఉన్నారన్న విషయాలను వైసీపీ వ్యతిరేకులు ప్రస్తావిస్తున్నారు.

అంతేకాకుండా నాడు ఎల్జీ పాలిమర్స్ బాదితులకు జగన్ రూ.1 కోటి ఇప్పించినట్లుగా… ఇప్పుడూ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అంతే మొత్తం పరిహారం ఇప్పించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటి జగన్ పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.