మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా సిద్ధంగానే ఉంటారని చెప్పాలి. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల వేళ… మధ్యప్రదేశ్ లో పోరాడి మరీ గెలవాల్సిన రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు పార్టీ సిద్ధం కాగా.. అందుకు తన వంతుగా సాయం చేసేందుకు డీకే రంగంలోకి దిగిపోయారు.

మధ్యప్రదేశ్ కోటాలో టీపీసీసీ ఇంచార్జీగా పనిచేస్తున్న మీనాక్షి నటరాజన్ బరిలోకి దిగారు. మీనాక్షి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కట్టుదాటకుండా ఉండేలా బెంగళూరులో క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. వెరసి మీనాక్షి గెలుపు కోసం డీకే నార్త్ ఇండియా క్యాంపును సౌత్ ఇండియాలో ఏర్పాటు చేస్తున్నారు.

జాతీయ స్తాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా… కర్ణాటక రాజకీయాల వరకే పరిమితం అయిన డీకే… కాంగ్రెస్ విపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి వస్తున్న ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. మొత్తానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఆయన సేవలు అందరికీ అందిపోతెన్నాయి.

పార్టీ అధిష్ఠానం ఆదేశించడమే తరువాయి ఇట్టే రంగంలోకి దిగిపోతున్న డీకే… పార్టీ పనిని నిబద్ధతతో పూర్తి చేస్తున్నారు. మరి మీనాక్షి గెలుపు కోసం ఏర్పాటు చేస్తున్న ఉత్తరాది క్యాంపును డీకే ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

మధ్యప్రదేశ్ కోటాలో ఇప్పుడు మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అదికార పార్టీగా కొనసాగుతూ..230 అసెంబ్లీ సీట్లలో 165 సీట్లతో బలీయంగా ఉంది. ఇక విపక్ష హోదాకే పరిమితం అయిన కాంగ్రెస్ కు కేవలం 63 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిత్రపక్షం బీఏపీకి ఉన్న ఏకైక సీటును కలుపుకుంటే… కాంగ్రెస్ బలం 64కు చేరుకుంటుంది. ఈ లెక్కన ఒక్కో రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు ఏ పార్టీకి అయినా కనీసం 58 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.

తనకున్న 165 మంది ఎమ్మెల్యేలతో రెండు రాజ్యసభ సీట్లను బీజేపీ ఈజీగానే గెలుచుకుంటుంది. ఆ తర్వాత ఇంకో 48 మంది దాకా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి అదనంగా ఉన్నారు. దీంతో మూడో స్థానానికి కూడా ఆ పార్టీ నామినేషన్ వేసింది. ఈ సీటుకు కాంగ్రెస్ పార్టీ మీనాక్షిని రంగంలోకి దింపింది. ఇప్పటికే మీనాక్షీ నామినేషన్ దాఖలు చేశారు.

అయితే చివరి నిమిషంలో మూడో సీటుకు బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగడంతో మీనాక్షి గెలుపు అంత సులువు కాదని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్ముల్యేలను కాపాడుకునేందుకు ఆ పార్టీ క్యాంపు ఏర్పాటు చేయక తప్పలేదు. ఈ క్యాంపు డీకే ఆధ్వర్యంలో బెంగళూరులో అయితే ఒకింత ప్రశాంతంగా ఉంటుందన్న భావనతో దానిని కన్నడనాట ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ క్యాంపు నుంచి కాంగ్రెష్ ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా డీకే కాపాడటంపైనే మీనాక్షి విజయం ఆదారపడి ఉందని చెప్పాలి.