విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ క్రమంలో ప్రమాదంపై పరిశీలన జరపడంతో పాటుగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఓదార్పుతో పాటు క్షతగాత్రుల ఫ్యామిలీలను పరామర్శించే నిమిత్తం మంగళవారం పొద్దున్నే లోకేశ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కేజీహెచ్ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో వామపక్షాల నేతలతో పాటు కొందరు కార్మిక సంఘాల నేతలు లోకేశ్ తో వాదనకు దిగారు. ఈ సందర్భంగా లోకేశ్ తనదైన శైలి సమాధానంతో వారి నోళ్లను మూయించారు.
కేజీహెచ్ వద్ద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో ఆయా కార్మిక సంఘాలకు చెందిన లెఫ్ట్ పార్టీ నేతలు లోకేశ్ ముందు నినాదాలు చేశారు. బాదిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగని వారు… కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదానికి కూటమి సర్కారుదే బాధ్యత అని ఆరోపించారు. ఈ సందర్భంగా లోకేశ్ వెంట అక్కడికి వెళ్లిన హోం మంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ లు వారిని వారించేందుకు యత్నించారు. అయినా లెఫ్ట్ పార్టీల నేతలు తగ్గకపోవడంతో ఇక లోకేశ్ నేరుగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉన్నది తామేనని లోకేశ్ ఈ సందర్భంగా లెప్ట్ పార్టీ నేతలకు చెప్పారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదో చనిపోయిన వారిని నాలుగు డబ్బులు వేసి చేతులు దులుపుకునేందుకు ఇక్కడికి రాలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా కుటుంబ యజమానులను కోల్పోయి తీరని వేదనలో ఉన్న ఆయా కుటుంబాలకు అండగా నిలిచేందుకే తాము ఇక్కడికి వచ్చామని ఆయన చెప్పారు. ప్రమాదాలు జరగాలని ఎవరూ కోరుకోరన్న లోకేశ్.. అసంకల్పితంగా జరిగే ప్రమాదాలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అందుకోసమే తామంతా ఇక్కడికి వచ్చామని ఆయన పదే పదే చెప్పారు.
కేబినెట్ లోని ఓ కీలక మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే… అంతా సైలెంట్ అయిపోతారు. అయితే విశాఖ లెఫ్ట్ నేతలు మాత్రం తమ నినాదాలను మరింతగా పెంచారు. పరిహారం కంటే కూడా జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వ మెడకు చుట్టేలా సంచలన ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఏమాత్రం సహనం కోల్పోని లోకేశ్…చనిపోయింది మీ కుటుంబ సభ్యులు కాదు కదా… చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుని వారికి అండగా నిలిచి.. భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చామని లోకేల్ చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ స్వరం పెంచి మాట్లాడిన తీరుతో లెఫ్ట్ నేతలు సద్దుమణగక తప్పలేదు. మొత్తంగా మొదట అనునయిస్తూ చెప్పిన లోకేశ్… ఆ మాత్రం దానికి వారు దారికి రాకపోవడంతో స్వరం పెంచి వారి ఉద్దేశ్యాన్ని బయటపెట్టి… రాద్దాంతం చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates