తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలన్న కసితో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అప్పుడే తన వ్యూహాలకు పదును పెడుతోంది. పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు రెండున్నరేళ్లే ఉండటంతో తాను మళ్లీ యాక్టివేట్ అయ్యేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు. అంతేకాదండోయ్… వచ్చే ఏడాది అంటే 2027లో తెలంగాణవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారట.
ఈ మేరకు కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడే యాక్టివేట్ కావాలని నిర్ణయం తీసుకున్నారని, ఈ రెండున్నరేళ్ల కాలంలో కేసీఆర్ పూర్తిగా ప్రజలతోనే సాగుతారని, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం సాగిస్తారని హరీశ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా… 2027లో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తగా పర్యటిస్తారని, ఇందుకోసం ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారని హరీశ్ చెప్పారు.
ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలతో మమేకం కానున్న కేసీఆర్.. ప్రతి క్షణం ప్రజలతోనే ఉంటారని కూడా హరీశ్ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇకపై కేసీఆర్ తరచూ వస్తారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయా సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాల్లో కేసీఆర్ పాలుపంచుకుంటారని కూడా ఆయన చెప్పారు. జిల్లాల పర్యటనలు కూడా కేసీఆర్ చేస్తారన్నారు. అంతిమంగా కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్ ఎన్నికలకు వెళుతుందని హరీశ్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే… గడచిన రెండున్నరేళ్ల పాటు కేేసీఆర్ రెస్ట్ మోడ్ లోనే ఉండటానికి గల కారణాలను కూడా హరీశ్ రావు వెల్లడించారు. కొత్తగా కొలువుదీరిన రేవంత్ సర్కారుకు కొంత సమయం ఇచ్చి చూద్దామని కేసీఆర్ భావించారని ఆయన చెప్పారు. ఇప్పుడు రేవంత్ సర్కారుకు గ్రేస్ పీరియడ్ ముగిసిందని, ఈ కారణంగానే కేసీఆర్ ఇక బయటకు వస్తున్నారని చెప్పారు. రేవంత్ సర్కారు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ కేసీఆర్ భారీ కార్యక్రమాలు చేపట్టనున్నారని హరీశ్ రావు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates