చంద్ర‌బాబు ఎంపిక‌పై తమ్ముళ్ళు ఏమంటున్నారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా రాజ్య‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అయిన నేప‌థ్యంలో మూడు స్థానాల‌ను టీడీపీ తీసుకుని.. ఒక స్థానాన్ని మిత్ర‌ప‌క్షం జ‌న‌సేనకు కేటాయించారు. ఈ క్ర‌మంలో తీవ్ర ఉత్కంఠ న‌డుమ‌.. టీడీపీ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. యువ నాయ‌కుడు, పార్టీకి అత్యంత వీర విధేయుడుగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడికుమారుడు విజ‌య్‌కు ఒక‌స్థానం, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సానా స‌తీష్‌కు మ‌రో సీటును, విద్యా సంస్థ‌ల అధిప‌తి భాష్యం రామ‌కృష్ణ‌కు మ‌రో స్థానం ఇచ్చారు.

మొత్తానికి టీడీపీలో కొన‌సాగుతున్న తీవ్ర ఉత్కంఠ‌కు చంద్ర‌బాబు తెర‌దించారు. అభ్య‌ర్థులు త‌మ త‌మ నామినేష‌న్ల‌ను సోమ‌వారం దాఖ‌లు చేయ‌నున్నారు. అయితే.. ఈ ఎంపిక‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. రెండు అంశాల‌పై ప్ర‌ధానంగా ఈ చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 1) రాజ‌కీయ కుటుంబాల‌కే ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌న్న‌ది. వాస్త‌వ‌మే.. ప్ర‌స్తుతం విజ‌య్ విష‌యంలోనే ఈ వాద‌న వినిపిస్తోంది. ఆయన తండ్రి అయ్య‌న్న ప్ర‌స్తుతం స్పీక‌ర్‌గా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్‌కు రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ఏంట‌న్న‌ది ప్ర‌త్యేక వాద‌న‌. అయితే.. ఈ విష‌యంలో చంద్రబాబు అన్నీ ఆలోచ‌న చేసి.. విజ‌య్‌కు అవ‌కాశం ఇచ్చార‌న్న‌ది సీనియ‌ర్ల వాద‌న‌. 2024 ఎన్నిక‌ల‌కు ముందు చేతులు ముడుచుకుని కూర్చోకుండా విజ‌య్ పార్టీ కోసం ఎంతో శ్ర‌మించారు. ఇది ఆయ‌న‌కు ఇప్పుడు ఉప‌యోగ‌ప‌డుతోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న చూపిన ఉత్సాహం కూడా..ఇప్పుడు క‌లిసి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. సో.. విజ‌య్ ఎంపిక వెనుక ఆయ‌న క‌ష్టం చాలానే ఉంద‌ని చెబుతున్నారు.

ఇక‌, 2వ వాద‌న‌.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌: మ‌హిళ‌లకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తామ‌ని.. ఇది త‌మ‌తోనే ఆరంభ‌మ‌వుతుంద‌ని ఇటీవ‌ల మ‌హానాడు వేదిక‌గా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనికి మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌.. మ‌రింత ఎక్కువ‌గానే చెప్పారు. సో.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక సీటును మ‌హిళ‌ల‌కు కేటాయిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ… రాజ్య‌స‌భ సీట్లలో ఒక్క‌టి కూడా మ‌హిళ‌ల‌కు కేటాయించ‌లేదు. అయితే.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు త‌ప్పేమీ చేయ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికిప్పుడు మ‌హిళ‌ల‌కు ఇస్తామ‌ని చెప్ప‌లేదని.. కాబ‌ట్టి చంద్ర‌బాబు ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు.