కేంద్రంలో పెరిగిపోతున్న 4వ తేదీ టెన్షన్

జనవరి 4వ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే రైతుసంఘాలతో చర్చలకు నిర్ణయమైన తేదీ 4వ తేదీనే కాబట్టి. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు గడచిన 38 రోజులుగా జరుగుతున్న ఉద్యమం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కావాలంటే సవరణలు మాత్రం చేస్తామని ప్రదానమంత్రి నరేంద్రమోడి తెగేసి చెప్పారు. ఈ కారణంగానే ఇటు కేంద్రప్రభుత్వం అటు రైతుసంఘాల మధ్య చర్చల్లో పురోగతి కనబడటం లేదు.

ఇప్పటికి ఏడుసార్లు కేంద్రమంత్రులతో చర్చలు జరిగినా ఉపయోగం కనబడలేదని రైతుసంఘాల నేతలు ప్రకటించారు. జనవరి 4వ తేదీన ఎనిమిదో సారి సమావేశం కూడా ఫెయిల్ అయితే భారీ కార్యాచరణ ప్రణాళికకు రైతుసంఘాల నేతలు రెడీ అయిపోతున్నారు. ముందుగా హర్యానాలో అన్నీరకాల షాపింగ్ మాల్స్, పెట్రోలు బంకులు మూసివేయబోతున్నట్లు ప్రకటించారు. తర్వాత పరిస్దితిని సమీక్షించుకుని దశలవారీగా మరిన్నింటిని మూయించేస్తామని నేతలంటున్నారు. హర్యానాలో మొదలైతే తర్వాత ఇదే పద్దతిని పంజాబులో కూడా అమలు చేస్తామని చెప్పటం గమనార్హం.

అసలు రైతు ఉద్యమం మొదలైందే పంజాబులో. ఆ తర్వాత హర్యానాకు పాకింది. అయితే ముందు షాపింగుమాల్స్, పెట్రోలు బంకులను హర్యానాలో ఎందుకు మూసేస్తున్నారు ? ఎందుకంటే ఢిల్లీ-హర్యానా బార్డర్స్ లోని సింఘు ప్రాంతంలోనే ఇపుడు ఉద్యమం జరుగుతోంది కాబట్టే. ఎవరైనా ఢిల్లీలోకి రోడ్డుమార్గంలో ప్రవేశించాలంటే హర్యానాలోని సింఘు ప్రాంతంనుండే వెళ్ళాలి. అందుకనే సింఘూ ప్రాంతం మొత్తాన్ని వేలాది మంది రైతులు ఆక్రమించేసుకున్నారు. ఉద్యమ ప్రభావం పంజాబులో ఎంతుందో హర్యానాలో అంతకుమించే ఉంది.

ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఉద్యమప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర, రాజస్ధాన్ లో కూడా కనబడుతోంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో కూడా మొదలైంది. సరిగ్గా పశ్చిమబెంగాల్లో ఎన్నికలకు ముందు ఇటువంటి రైతుఉద్యమం మొదలవ్వటంతో కేంద్రప్రభుత్వంలోని పెద్దల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు జరిగినది చూస్తుంటే జనవరి 4వ తేదీన జరగబోయే కేంద్రమంత్రులు, రైతుసంఘాల చర్చలు సక్సెస్ అవుతాయనే నమ్మకం ఎవరిలోను లేదు. ఈ కారణంగానే ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు, తీవ్రస్ధాయికి చేర్చేందుకు రైతుసంఘాలు రెడీ అయిపోతున్నాయి. చూద్దాం 4వ తేదీన ఏమవుతుందో.