కృషి ఉంటే… సేనానికి క‌ష్ట‌మేమీ కాదు..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..త‌న పార్టీని తెలంగాణ‌లోనూ విస్త‌రించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పారు. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన .. మీడియా స‌మావేశంలో ఆవేశంతో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తామ‌ని కూడా తేల్చిచెప్పారు. సో.. దీంతో తెలంగాణ‌లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. వాస్త‌వానికి తెలంగాణలో జ‌న‌సేన పోటీ చేయ‌డం ఇదే తొలిసారి కాదు.

2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అక్క‌డి ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంది. కానీ, అదే స‌మ‌యంలో జ‌న‌సేన మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ పోరులో త‌ల‌ప‌డింది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీచేయ‌గా.. జ‌న‌సేన 8 చోట్ల పోటీకి దిగింది. కానీ.. ఏ ఒక్క‌స్థానంలోనూ జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. ఇక‌, ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. ఓవ‌రాల్‌గా జ‌న‌సేన‌కు 0.25 శాతం మాత్ర‌మే ఓట్ షేర్ ల‌భించింది.

అయితే.. అనంత‌ర కాలంలో దీనిని పెంచుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో దూరంగా ఉన్నారు. అంతేకాదు.. గ‌త ఏడాది గ్రామీణ స్థాయి ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్పుడు కూడా జ‌న‌సేన బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ.. ఆ పార్టీ మ‌ద్ద‌తు దారులు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోలు పెట్టుకుని.. పోటీకి దిగారు. ఇలా.. ఒక ఊపు ఉన్న‌ప్ప‌టికీ.. జ‌న‌సేన విస్త‌రించేందుకు పార్టీ అధినేత మ‌రింత కృషి చేయాల్సి ఉంది.

యువ‌త‌, సినీరంగం.. సెటిల‌ర్లు.. వంటివారు.. జ‌న‌సేన‌కు క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన వ‌న‌రు. ఏపీ మూలాలు ఉన్న తెలుగు వారు.. హైద‌రాబాద్ స‌హా వ‌రంగ‌ల్ వంటికీల‌క న‌గ‌రాల్లోఎక్కువ‌గా ఉన్నారు. వీరిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతోపాటు.. తెలంగాణ‌లో జ‌న‌సేన స్థిరంగా ఎదుగుతుంద‌న్న సంకేతాలు ఇస్తే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌కు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఖ‌చ్చిత‌గా ల‌భిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఏపీలోను, అటు.. తెలంగాణ‌లోనూ ఏక‌కాలంలో పార్టీని విస్త‌రించ‌డం అంటే.. ప‌వ‌న్‌కు అంత సులువేవీ కాదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.