“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ సంకల్ప సభ నేపథ్యంలో తెలంగాణ నేతల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి.

పవన్ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించగా… తాజాగా మంగళవారం హైకోర్టు కూడా సభకు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జనసేనానిపైనా, బీజేపీపైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. రాజకీయం తెలియని పవన్ ను బీజేపీ నేతలు బలి చేస్తుర్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ ను ముందు పెట్టిన బీజేపీ నేతలు, ప్రధాని మోదీ… తెలంగాణపై విషం చిమ్ముతున్నారని దయాకర్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ కేమీ తెలియదని చెప్పిన దయాకర్… పాపం పవన్ ను బలి చేయొద్దని ఆయన బీజేపీ నేతలకు సూచించారు. పవన్ కు రాజకీయం తెలియదన్న దయాకర్ అందుకు తనదైన శైలి కారణాలనూ వెల్లడించారు.

ప్రత్యేక తెలంగాణ కోసం హోరాహోరీగా ఉద్యమం సాగుతున్న తరుణంలో తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడారని ఆయన అన్నారు. అంతేకాకుండా చేగువేరా అనుచరుడు అయిన పవన్ నోట సనాతన ధర్మం మాట వినిపించిందని ఆయన ఆరోపించారు.

పవన్ సభకు హైకోర్టు కూడా అనుమతి ఇవ్వని నేపథ్యంలో దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని తన ఇంటిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని కోరినా… అందుకు కూడా అనుమతి దక్కదని దయాకర్ అన్నారు.

ఈ విషయాన్ని పవన్ గ్రహించాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుతం అన్ని పరిస్థితులు సవ్యంగానే ఉన్నాయన్న దయాకర్… పవన్ లాంటి నేతలు వచ్చి… తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొడతామంటే తెలంగాణ వాదులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.