ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు.. చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా రాజమహేంద్రవరం పర్యటనలో గోదావరి కాలుష్య సమస్యపై ఆయన తీసుకున్న చర్చలు నిబద్ధతకు నిదర్శనంగా ఉన్నాయని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు రోజుల పర్యటన ముగిసిన 24 గంటల్లోనే రాష్ట్ర ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం అత్యున్నత స్థాయి ‘ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ఫోర్స్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం ద్వారా పవన్ దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారానికి నాంది పలికారని భావిస్తున్నారు.
గత నెల చివరిలో రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన గోదావరి నదీ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడులైన గోదావరి, కృష్ణా నదులు పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారణాల వల్ల నదులు పాడవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ‘‘భక్తులు నదిలో రసాయనాల స్నానం చేయాలా? పవిత్ర స్నానం చేయాలా?’’ అంటూ డిప్యూటీ సీఎం లేవనెత్తిన ప్రశ్న అధికార యంత్రాంగాన్ని, సమాజాన్ని ఆలోచింపజేసింది. వెనువెంటనే గోదావరి కాలుష్య నివారణ కోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పవన్ కళ్యాణ్ రూపొందించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల పరిధిలో 262 గ్రామ పంచాయతీలను గుర్తించి మురుగురహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక కాలుష్య నియంత్రణ, మురుగు నిర్వహణ పర్యవేక్షణ కోసం ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేటాయించిన రూ.100 కోట్లతో పాటు అవసరమైతే ఇతర నిధులను కూడా వినియోగిస్తారు.
కొత్తగా ఏర్పాటైన టాస్క్ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మ్యాజిక్ డ్రెయిన్లు, బ్లాక్ వాటర్ నిర్వహణ, ట్విన్ పిట్ వ్యవస్థల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై దశలవారీగా నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపారు.
పరిశ్రమలు ఆధునిక కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారని చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న గోదావరి కాలుష్య సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ చారిత్రాత్మకమని మంత్రి పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates