సోష‌ల్ ఉద్య‌మం: ఏపీలో తెలంగాణ విగ్ర‌హాలు|

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంద‌రికీ తెలిసిందే. బొద్దింక‌ల పార్టీగా ప్రారంభ‌మై.. ఒక వైపు వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే మ‌రోవైపు సీరియ‌స్ పాలిటిక్స్ దిశ‌గా కూడా ఇది ప‌య‌నిస్తోంది. సోష‌ల్ మీడియాలో పెను దుమారం కూడా సృష్టించింది. తాజాగా తెలంగాణ‌లోని తెలంగాణ థింకర్స్ ఫోరమ్ సోష‌ల్ మీడియాలో కొత్త ఉద్య‌మానికి తెర‌దీసింది. ఏపీ నేత‌ల విగ్ర‌హాల‌ను తెలంగాణ‌లో పెడుతున్నార‌ని.. మ‌రి తెలంగాణ నేత‌ల విగ్ర‌హాల‌నుకూడా ఏపీలో పెట్టాల‌న్న‌ది ఈ ఫోర‌మ్ డిమాండ్‌.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణకు చెందిన వారి విగ్ర‌హాల‌ను ఏపీలోనూ ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సోష‌ల్ మీడియాలో 350 మంది వ‌ర‌కు ఫాలోవ‌ర్లు కొన‌సాగుతున్నారు. దీనికి పలువురు తెలంగాణ వాదులు, మేధావులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. తెలంగాణ‌లో ఏపీ వారి విగ్ర‌హాలు పెడుతున్న‌ప్పుడు.. తెలంగాణ‌కు చెందిన వారి విగ్ర‌హాల‌ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాల‌న్న‌ది వీరి ప్ర‌ధాన డిమాండ్‌.

ఎందుకు?

ఇటీవ‌ల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన స‌మ‌యంలో ఆయ‌న విగ్ర‌హ ఏర్పాటును త‌ప్పుబ‌ట్టిన వారిపై కొంద‌రు.. ఎన్టీఆర్ ఉమ్మ‌డి ఏపీ సీఎం కాబ‌ట్టి విగ్ర‌హ ఏర్పాటు త‌ప్పుకాదు అని స‌మ‌ర్ధించారు. దీంతో ఉమ్మ‌డి ఏపీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన‌.. పీవీ న‌ర‌సింహారావు(తెలంగాణ వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన నాయ‌కుడు) విగ్ర‌హాన్ని ఏపీలో పెట్టాల‌న్న‌దిఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన డిమాండ్‌. అంతేకాదు.. నాడు ర‌జాకార్ల‌పై తిర‌గ‌బ‌డ్డ చాక‌లి ఐల‌మ్మ‌, రాణీ రుద్ర‌మ వంటి వీర‌నారుల విగ్ర‌హాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ సానుకూలం..

ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ సానుకూలంగా స్పందించింది. ఉమ్మ‌డి రాష్ట్రం కోసం ప‌నిచేసిన వారి విగ్ర‌హాలు ఏర్పాటు చేసేందుకు తాము మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. వారు తెలుగు వారందరి ఉమ్మడి ఆస్తి. అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. ప్రాంతాల ప‌రంగా వేర‌య్యామే కాద‌ని.. మ‌నుషులుగా కాద‌న్నారు. ఏపీ , తెలంగాణ‌ల‌లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కు అంద‌రూ హాజ‌ర‌వుతున్నార‌ని ఆయ‌న ముక్తాయించారు. ఏపీలో పీవీ విగ్ర‌హం పెట్టినా.. తాము అభ్యంత‌రం చెప్ప‌బోమ‌న్నారు. మ‌రోవైపు.. సీఎంచంద్ర‌బాబుకు ఫోర‌మ్ లేఖ రాసింది.