అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక రంగాల నుంచి డిమాండ్ పెరిగింద‌న్నారు. ముఖ్యంగా ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు అమరావ‌తిలో స్టూడియోలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నార‌ని చెప్పారు. త‌మ‌కు భూము లు కేటాయించాల‌ని ప్ర‌భుత్వానికి విన్న‌విస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. వారి ఆర్థిక లావాదేవీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో వారి బ్యాలెన్సు షీట్ల‌ను అడిగిన‌ట్టు తెలిపారు.

రాజధానిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఆన్ లైన్ లో తాజాగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, సంధ్యా రాణి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అనంత‌రం.. మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయించామ‌న్నారు. వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు,44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయన్నారు. మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాలతో కేటాయింపులు రద్దు చేసుకున్నాయని పేర్కొన్నారు.

మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన దానికి బదులు వేరే చోట భూకేతయింపు చేసిన‌ట్టు మంత్రి వివ‌రించారు. మ‌రోవైపు.. రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత ఉంద‌ని.. జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రి నారాయ‌ణ తోసిపుచ్చారు. డీజిల్ నిల్వ‌లు కావాల్సినంత ఉన్నాయ‌ని తెలిపారు.

అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో భారీ నిర్మాణాలు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోడీ అందరికీ సూచించారని.. అయిన‌ప్ప‌టికీ.. అమరావతి రాజధాని కాబట్టి కొనసాగిస్తున్నామ‌ని చెప్పారు. 29,000 మంది రైతులు ఎంతో ఆశతో రాజధానికి భూములు ఇచ్చారని చెప్పిన నారాయ‌ణ‌.. గత 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా ఏవో కార‌ణాల‌తో రాజధాని నిర్మాణం ఆపివేస్తే రైతులు ఇబ్బంది పడతారని, రైతులు ఇబ్బంది పడకూడదనే అమరావతి నిర్మాణం పై ముందుకు వెళ్తున్నామ‌ని నారాయ‌ణ చెప్పారు. కాగా.. పొరుగు రాష్ట్రాల‌కు చెందిన వారు ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని తెలిపారు.

అమరావతిలో భూముల కోసం ముంబైకి చెందిన కొంతమంది సినీ పరిశ్రమ వాళ్లు వచ్చారని చెప్పారు. స్టూడియోలు, క‌ళా కేంద్రాలు నిర్మిస్తామ‌ని అంటున్నార‌ని తెలిపారు. అయితే.. భూము లు కేటాయించాలంటే ఫైనాన్సియల్ sheets,బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నామ‌న్నారు. అవి చూసిన త‌ర్వాత‌.. సీఎంతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.