గోదావరి పుష్కరాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా… పని ఒకటే గానీ… రెండు రకాల ప్రయోజనాలు ఇచ్చే దిశగా సాగుతోంది. ఇప్పటికే రెండు రోజుల పాటు గోదావరి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చిన పవన్…తాజాగా శుక్రవారం పవిత్ర గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించే దిశగా ఓ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఈ ప్లాన్ తో గోదావరి పుష్కరాలు పవిత్ర జలాలతో కొనసాగడమే కాకుండా… గోదావరి పరివాహక గ్రామాలు కూడా కాలుష్యరహితంగా మారనున్నాయి.
పవన్ విడుదల చేసిన యాక్టస్ ప్లాన్ ప్రకారం గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలన్నింటా కాలుష్య రహితంగా రూపుదిద్దుకోనున్నాయి. గోదావరి పుష్కరాలు ఏపీలోని ఆరు జిల్లాల పరిధిలోని 262 గ్రామాల్లో కొనసాగున్నాయి. ఈ గ్రామాల ద్వారా కాలుష్యాలు గోదావరిలో కలవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పవన్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయా గ్రామాల పరిధిలో కాలుష్యాలను తొలగించేందుకు ప్రత్యేకంగా ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి. మునిసిపాలిటీల మాదిరే ఇప్పుడు గ్రామాల్లోనూ ఈ ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి. ఫలితంగా ఈ గ్రామాల నుంచే కాకుండా పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాలను వడబోసిన తర్వాతే ఆ నీటిని గోదావరిలోకి వదులుతారు.
ఇందుకోసం కాలుష్య నివారణ కోసం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి మంజూరు చేసిన రూ.100 కోట్ల నుంచి కూడా వినియోగించే దిశగా పవన్ స్ట్రాటజీ సాగుతోంది. రోజువారీగా ఆయా పరిశ్రమలు, గ్రామాల నుంచి విడుదలవుతున్న 104 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి వదిలేలా ఈ నిధులతో ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నీటిలో ఆయా పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యకారక నీటితో పాటు గ్రామాల నుంచి వస్తున్న కాలుష్య నీరు, ఆక్వా నుంచి విడుదలవుతున్న కాలుష్య జలాలు ఉన్నాయి. వీటన్నింటినీ శుద్ది చేసేందుకు ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి.
ఇకపై ఆయా పరిశ్రమల నుంచి కాలుష్యకారక జలాలు నేరుగా గోదావరిలోకి చేరకుండా నిత్యం నిఘా పెట్టేలా ఓ కార్యాచరణను రంగంలోకి దించనున్నారు. ఇందుకోసం ఆర్టీజీఎస్ తరహాలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు కానుంది. ఈ కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలు పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కు అప్పగించనున్నారు. వెరసి కాలుష్య రహిత గోదావరి పుష్కరాలతో పాటుగా ఆయా గ్రామాలకూ కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates