ఏపీలో వైసీపీ పాలనలో చోటుచేసుకుంటున్నట్లుగా చెబుతున్న లిక్కర్ కుంభకోణంపై కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును మరింతగా విస్తరించింది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో భాగంగా వెల్లడైన అంశాల ఆధారంగా కొత్త నిందితుల విచారణను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కె.నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్)ను విచారణకు పిలిచింది.
సిట్ నోటీసులకు సానుకూలంగానే స్పందించిన కేఎన్నార్… నోటీసుల్లో పేర్కొన్నట్లుగా బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. గురువారం నాటి విచారణ అసంపూర్తిగా ముగిసిందని భావించిన సిట్… గురువారం కూడా విచారణకు రావాలని కేఎన్నార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా వరుసగా రెండో రోజైన గురువారం కూడా కేఎన్నార్ సిట్ విచారణకు హాజరయ్యారు.
బుధవారం నాటి విచారణ విషయానికి వస్తే… సిట్ సందించిన మెజారిటీ ప్రశ్నలకు కేఎన్నార్ నుంచి సమగ్రమైన సమాధానమే రాలేదని సమాచారం. తనకు తెలియదని మాత్రమే కేఎన్నార్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టు అయిన అదికారులు, నేతలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. తాను జగన్ కార్యక్రమాల పర్యవేక్షణను మాత్రమే చూస్తానని, మిగిలిన వ్యవహారాల్లో తనకు అంతగా ప్రమేయం ఉండదని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే జగన్ పీఏను వరుసగా రెండో రోజు కూడా సిట్ విచారణకు పిలవడంతో ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates