ముగిసిన వివాదాన్ని మళ్ళీ ఎందుకు మొదలుపెట్టడం?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల మధ్య జరిగిన భేటీలో జరిగింది ఇదీ అంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. నాగేశ్వర్ వ్యాఖ్యలపై బీజేపీ కామ్ గానే ఉన్నా… జనసేన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటించి… దాదాపుగా సారీ చెప్పినంత పనిచేశారు. ఈ మార్పును గౌరవించిన పవన్ కల్యాణ్… ఇక ఇది ముగిసిన అధ్యాయమని ప్రకటించారు. అయితే ఈ ముగిసిన అధ్యాయాన్ని కొందరు జర్నలిస్టులు తిరిగి కదిలించే పని చేస్తున్నారు. ఇది ఏ ఉపద్రవాలకు దారి తీస్తుందోనన్న వాదనలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి..

ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారన్న వార్తలు మంగళవారం కలవరపాటుకు గురి చేశాయి. అయితే నాగేశ్వర్ అరెస్టు అక్కర్లేదని పవనే స్వయంగా పోలీసులను వారించారు. ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందిపోయి… దీనిపై మరింతగా అజ్జి రాజేసేలా కొందరు జర్నలిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి పవన్ తీరును తూర్పారబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తో పాటు చంద్రబాబును, ఏపీకి చెందిన పత్రాకాధిపతులనూ ఆయన తనదైన శైలిలో విమర్శించారు.

పవన్ ను నాగేశ్వర్ తో పోల్చడానికి ఏముంది అంటూ వ్యాఖ్యానించిన యాదగిరి… నాగేశ్వర్ మహోన్నతుడు అయితే పవన్ లిల్లీపుట్ లాంటి వాడని అన్నారు. అయినా నాగేశ్వర్ చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని చెప్పినందుకే నాగేశ్వర్ ను అరెస్టు చేస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. పవన్ తరహా వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛపై దాడులేనని ఆయన నిందించారు. చేగువేరా భక్తుడినంటూ ఫోజులు కొట్టే పవన్… రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. గద్దర్ నూ ఇలాగే పవన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.

ఇక ఈ విషయంలోకి ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని తీసుకుని వచ్చిన యాదగిరి… తెలంగాణలోని అక్రిడిటేషన్లన్నీ ఆంధ్రా పత్రికలు, శాటిలైట్ ఛానెళ్లకే అందుతున్నాయని ఘాటు వ్యాఖ్య చేశారు. ఓ రెండు టీవీ ఛానెళ్లు తప్పించి మిగిలినవన్నీ ఆంధోళ్లవే కదా అని కూడా ఆయన ప్రస్తావించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అక్రిడిటేషన్లన్నీ ఆంధ్రోళ్లకే దక్కుతున్నాయని, ఒక్క తెలంగాణ జర్నలిస్టుకు కూడా దక్కడం లేదని ఆరోపించారు. మొత్తంగా ముగిసిపోయిన అధ్యాయమని అంతా భావిస్తున్న నాగేశ్వర్ వివాదాన్ని యాదగిరి తనదైన శైలి వ్యాఖ్యలతో తిరిగి రేపారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలోకి తెలంగాణ వాదాన్ని లాగడమెందుకన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.