ఏపీలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయానికి బుధవారం నాడు ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. విపక్ష వైసీపీకి గొడ్డలి పార్టీ అంటూ అధికార టీడీపీ కొత్త పేరును పెడితే… వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ టీడీపీ పాలనపై వైసీపీ తనదైన శైలి సెటైర్లు సంధించింది. టీడీపీ వార్షిక వేడుక వేదిక మీడ నుంచి వైసీపీని తూలనాడుతూ చంద్రబాబు ప్రసంగం చేస్తే.. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోందని, ఈ రెండేళ్లలో టీడీపీ ఎన్నో వెన్నుపోట్లు పొడిచింది అంటూ వైసీపీ ఏకంగా ఓ బుక్కును రిలీజ్ చేసింది. వెరసి బుధవారం నాడు ఈ రెండు పార్టీల మధ్య సెటైరికల్ వార్ జరిగిందని చెప్పాలి.
టీడీపీ ఏటా నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుక మహానాడు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత హోదాలో సీఎం నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షోపన్యాసంతో మహానాడు ప్రారంభం కాగా… ప్రారంభోపన్యాసంలోనే వైసీపీపై గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చంద్రబాబు సెటైర్లు సంధించారు.
వైసీపీని గొడ్డలి పార్టీ అని ఆయన సంబోధించారు. వేట కొడవళ్ల సంస్కృతి నుంచి వైసీపీ గొడ్డలి చేతబట్టే పార్టీగా ఎదిగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా వైసీపీ,. టీడీపీల మధ్య వ్యత్యాసాలను ఆయన తనదైన శైలి సెటైరిక్ డైలాగులతో వివరించి తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించారని చెప్పాలి.
ఇక మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి ఓ సన్నాహక సమావేశాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన జగన్.. ఎన్నికలు పూర్తి అయ్యాక వాటిని టీడీపీ చెత్తబుట్టలో పడేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.
ప్రజలకు టీడీపీ వెన్నుపోటు పొడిచిందని, ఈ వెన్నుపోట్లను వివరిస్తూ ఓ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరును ఆ పుస్తకానికి పెట్టామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రతి కార్యకర్త వద్ద ఉండాలని కూడా జగన్ అభిలషించారు. మొత్తంగా అటు వైపు నుంచి గొడ్డలి పార్టీ అని వినిపిస్తే… ఇటు వైపు నుంచి వెన్నుపోటుకు రెండేళ్లు అనే మాట వినిపించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates