మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి రోజు రోజుకూ ఎంత బలహీనంగా మారిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే చాలు.. అందులో మాట్లాడే మాటలు ట్రోల్ మెటీరియల్స్ అయిపోతున్నాయి. జనాల్లో వ్యతిరేకత పెంచేలా, మీడియాలో-సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయంటూ వైసీపీ వాళ్లే తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
కొన్ని నెలల కిందట ‘మావిగన్’ అంటూ ఆయన చేసిన కొత్త రాజధాని ప్రతిపాదన ఎంత వ్యతిరేకత తెచ్చిపెట్టిందో, దాని మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. తాజాగా ఒక ప్రెస్ మీట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైసీపీకి తలపోటుగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తారని.. తన తాతను, తండ్రిని ఆయనే చంపించారన్నట్లుగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉండగానే తన బాబాయి వివేకానందరెడ్డి కూడా చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఐతే ఈ వ్యాఖ్యలు బూమరాంగ్ అయి వైసీపీ మెడకే చుట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై టీడీపీ, జనసేన అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్తో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, కొన్ని టీవీ ఛానెళ్లు జగన్ను గట్టిగా టార్గెట్ చేశాయి. రాజారెడ్డి ఒక శాంతిదూత అన్నట్లుగా జగన్ అండ్ కో ప్రొజెక్ట్ చేయాలని చూడగా.. ఈ మేరకు సాక్షిలో కూడా భూమన కరుణాకరరెడ్డి ఒక వ్యాసం రాయగా.. కౌంటర్ ఎటాక్ మామూలుగా లేదు.
రాజారెడ్డి చేతిలో హత్యాయత్నానికి గురైన టీడీపీ నేత పార్థసారథి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దశాబ్దాల పాటు రాజారెడ్డి చేసిన అకృత్యాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించారు. అలాగే వైఎస్, జగన్ చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి కూడా అనేక సంఘటనలను ఉదహరించారు.
మరోవైపు రాజారెడ్డి నుంచి జగన్ వరకు ఎవరి హయాంలో ఎలాంటి హత్యా రాజకీయాలు జరిగాయో అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరంగా వెల్లడిస్తున్నాయి.
ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు కూడా రెండు మూడు రోజులుగా ఇదే పని మీద ఉన్నాయి. ఆ సంస్థలు నిష్పాక్షికం, తటస్థం అని చెప్పలేం కానీ.. సాక్షితో పోలిస్తే వాటికి క్రెడిబిలిటీ ఎక్కువ. మరీ అడ్డగోలుగా అబద్ధాలు రాయవు. ఏం రాసినా ఆధారాలు చూపిస్తాయి. వివరణ ఇస్తాయి. మరోవైపు కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలు కూడా రాజారెడ్డి, వైఎస్, జగన్ల ఫ్యాక్షన్ నేపథ్యం సహా అనేక ఘటనల గురించి ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా ఎదురుదాడి చేస్తున్నారు.
వైఎస్ మరణం వెనుక సోనియా హస్తం, ముకేశ్ అంబానీ హస్తం అని ఆరోపించి, తాను అధికారంలో ఉండగా ఆ విషయాల ఊసే ఎత్తని జగన్.. అంబాని క్యాండిడేట్ అయిన నత్వానీకే రాజ్యసభ సభ్యత్వం ఇప్పించడం, మరోవైపు వివేకాది గుండెపోటుగా ప్రచారం చేసి, ఆయన హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే అండగా నిలవడం లాంటి ఉదంతాలను గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి జగన్ ప్రెస్ మీట్లో సింపుల్గా ఒక ఆరోపణ చేసి వెళ్లిపోగా.. అటు వైపు నుంచి కౌంటర్ ఎటాక్ మామూలుగా లేదు. చరిత్ర అంతా తవ్వి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల్లోని ప్రతికూల కోణాలన్నింటినీ బయటపెట్టేస్తుండడంతో దీనికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక వైసీపీ మద్దతుదారులు తలలు పట్టుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates