ఎట్టకేలకు ఫ్యాక్షన్ డిబేట్ పై స్పందించిన షర్మిల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిచ్చు రాజేసిన ఫ్యాక్షన్ రచ్చపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎట్టకేలకు మంగళవారం స్పందించారు. తన తాత, తండ్రి, బాబాయి మరణాలపై మొన్నామధ్య మీడియా సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ భగ్గుమంది.

రాజారెడ్డి, రాజశేఖరరెడ్డిలకు అసలు ఫ్యాక్షన్ వాసనలే సోలేదన్నట్లుగా జగన్ మాట్లాడారంటూ టీడీపీ నేతలు క్యూ కట్టి మరీ తమ వాదనలు వినిపించారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారధి చెడ్డి వినిపించిన వాదన అయితే తెలుగు నేలలో తెగ వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల… టీడీపీ వాదనలపై నిప్పులు చెరిగారు.

ఎప్పుడో చనిపోయిన వారిపై ఇప్పుడు ఈ రచ్చ ఏమిటని ప్రశ్నించిన షర్మిల… సమాధానం చెప్పుకునేందుకు వారు లేరనే కదా టీడీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. అయినా సంక్షేమ పాలన సాగిస్తామని అదికారం చేజిక్కించుకున్న టీడీపీ… సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. తన విఫల పాలనను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఈ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదని తేల్చేసిన షర్మిల… ఇకనైనా చంద్రబాబు బృందం వట్టి మాటలు కట్టి పెట్టి ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టే దిశగా సాగాలని సూచించారు.

ఇక తన తాత, తండ్రిపై చేసిన ఆరోపణలకు కౌంటర్లు ఇస్తూ షర్మిల ఆసక్తికర విషయాలను వెల్లదించారు. 1973లోనే తన తాత కడప జిల్లాలో 70 పడకల ఆసుపత్రికి కట్టించి ఉచిత వైద్య సేవలను అందించారని తెలిపారు. పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలను కట్టించి ఉచిత విద్యను అందించారని ఆమె గుర్తు చేశారు.

ఇక తన తండ్రి రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఆమె ఏకరువు పెట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణ మాఫీ, ఉచిత విద్యుత్ లను సాకారం చేసిన మహనీయుడు తన తండ్రి అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి.. ఐదేళ్లలో 23 శాతం పనులను వైఎస్సార్ పూర్తి చేస్తే… ఆ తర్వాత రెండు సార్లు సీఎంగా పదవి చేపట్టిన చంద్రబాబుకు ఆ పనులను పూర్తి చేయడం చేతకాలేదని ఆరోపించారు.

ఇదంతా బాగానే ఉన్నా… తాత, తండ్రిలపై వైరి వర్గాలు చేసిన ఆరోఫణలను ఖండించిన షర్మిల… తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వచ్చిన విమర్శలను అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. తాను విడుదల చేసిన ప్రకటనలో ఒక్కచోట కూడా జగన్ ప్రస్తావన లేకుండానే ఆమె దానిని పూర్తి చేశారు. జగన్ పై టీడీపీతో పాటు ఇతర పార్టీలు చేస్తున్న ఘాటు విమర్శలను ఖండించని షర్మిల… ఆ విమర్శలన్నీ వాస్తవమేనని ఒప్పుకున్నట్టైందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.