రైతుల‌కు రుణ మాఫీ.. సినిమాల‌కు ఐదు షోలు

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యం సాధించి రెండు వారాల కింద‌టే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు సినీ స్టార్ విజ‌య్. అప్ప‌ట్నుంచి త‌న‌దైన నిర్ణ‌యాల‌తో జ‌నాల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే స్కూళ్లు, ప్రార్థ‌న మందిరాల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న మ‌ద్యం దుకాణాల‌ను ర‌ద్దు చేయ‌డంతో ఆయ‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురిశాయి.

త‌ర్వాత కూడా మ‌రి కొన్ని మంచి నిర్ణ‌యాలు తీసుకున్నారు విజ‌య్. ఇప్పుడు ఒకే రోజు రెండు కీల‌క నిర్ణ‌యాల‌తో వ్య‌వ‌సాయ‌, సినీ రంగాల మీద ఆధార‌ప‌డ్డ వారిని సంతోషంలో ముంచెత్తారు విజ‌య్.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు గొప్ప ఊర‌ట‌నిస్తూ పాక్షిక రుణ మాఫీ ని ప్ర‌క‌టించారు విజ‌య్. త‌మిళ‌నాడులోని స‌హ‌కార బ్యాంకుల ద్వారా రూ.50 వేలు అంత‌కంటే త‌క్కువ మొత్తం రుణాలు పొందిన వాళ్లంతా లోన్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. దీని ప్ర‌కారం త‌మ‌ళ‌నాట 14.22 ల‌క్ష‌ల మంది రైతులకు సంబంధించి రూ.50 వేలు అంత‌కంటే త‌క్కువ రుణాల‌న్నీ మాఫీ కానున్నాయి.

విజ‌య్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణ‌యం ఇది. దీని వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాపై వేల కోట్ల భారం ప‌డ‌నున్న‌ప్ప‌టికీ విజ‌య్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌రోవైపు త‌మిళ‌నాట ఇటు ఇండ‌స్ట్రీ జ‌నాలు.. అటు సినీ ప్రేమికులు కోరుకుంటున్న ఐదు షోల వ‌రాన్ని విజ‌య్ అందించారు. డీఎంకే ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా.. కొత్త సినిమాల‌కు అద‌న‌పు షోలు వేసుకోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అందుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, పైర‌వీలు చేయ‌డం, ప్ర‌భుత్వం సెల‌క్టివ్‌గా అనుమ‌తులు ఇవ్వ‌డం.. ఇలా ఉండేది ప‌రిస్థితి.

ఐతే విజ‌య్ ప్ర‌భుత్వం ఇప్పుడు ప్ర‌త్యేకంగా అనుమ‌తులు పొందాల్సిన అవ‌స‌రం లేకుండా, అన్ని కొత్త సినిమాల‌కు వారం పాటు ఐదు షోలు ప్ర‌ద‌ర్శించుకునేలా జీవో ఇచ్చింది. దీంతో త‌మిళ‌నాట ప్ర‌తి పెద్ద సినిమాకూ అర్లీ మార్నింగ్ షోలు ప‌డ‌బోతున్నాయి ఇక‌నుంచి. ప‌ర్మిష‌న్ తీసుకోవ‌డం ద్వారా బెనిఫిట్ షోలు వేసుకునే సౌల‌భ్యం కూడా వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. విజ‌య్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ రెండు పెద్ద నిర్ణ‌యాల ప‌ట‌ల్ ఆయా వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.