గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన చర్చ.. అనంతర పరిణామాలపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేత జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని చెప్పారు.
అంతేకాదు.. వైసీపీ నేత జైలుకు వెళ్తే జనసేన ఎదుగుతుందా? అని ప్రశ్నించారు. అమిత్ షా వంటి పెద్ద మనిషి వద్దకు వెళ్లి.. ఇలా అడుగుతారా ఎవరైనా? అని వ్యాఖ్యానించారు. ఆయన దగ్గరకు వెళ్లింది.. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడేందుకేనని చెప్పారు.
అయితే..ఇంత జరుగుతున్నా.. బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని పవన్ ప్రశ్నించారు. దారిన పోయే వాళ్లు రాళ్లేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఎవరినో అరెస్టు చేయడానికి తాను రాజకీయం చేయడం లేదన్నారు. అయినా.. ఎవరినో అరెస్టు చేస్తే.. మనం ఎదుగుతామని అనుకోవడం లేదన్నారు.
అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా తెలుస్తాయని నిలదీశారు. శత్రువులు ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతజరుగుతున్నా బీజేపీ నేతలు మౌనంగా కూర్చున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఇది వ్యవస్థను అవమానించడమేనని పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు అన్నీ భరించానని.. ఇక భరించే ఓపిక లేదని అన్నారు. తాను కులాల గురించి మాట్లాడడం లేదనిఅంటున్నారని.. కానీ, తాను కుల నాయకుడిని కాదని వ్యాఖ్యానించారు. నేను కులం గురించి మాట్లాడడం లేదని పదే పదే విమర్శిస్తున్నారు.
కానీ, నేను ఎప్పుడైనా ఒక కులానికి పరిమితం అయ్యానని చెప్పానా? అని నిలదీశారు. ఇప్పటి వరకు పార్టీ నాయకులు చెప్పినట్టు తాను విన్నానని.. ఇక నుంచి తాను చెప్పినట్టు పార్టీ నాయకులు మసులు కోవాలని పవన్ తేల్చి చెప్పారు. నేను వ్యూహం రచిస్తా.. మీరు పాటించండి అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates